స్టింగ్ సంచలనం: ఒక్కో ఎమ్మెల్యేకు రూ.4కోట్లిచ్చిన శశికళ, పన్నీరు కూడా
తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలో మరో సంచలనం. ఇప్పటికే ఆ పార్టీలో పరిణామాలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. తాజాగా, పళనిస్వామి విశ్వాస పరీక్ష సమయంలో రూ.కోట్ల
చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలో మరో సంచలనం. ఇప్పటికే ఆ పార్టీలో పరిణామాలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. తాజాగా, పళనిస్వామి విశ్వాస పరీక్ష సమయంలో రూ.కోట్లు ఆఫర్ చేసినట్లు తేలింది.
ఓ టీవీ ఛానల్ స్టింగ్ ఆపరేషన్లో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. కొద్ది నెలల క్రితం పళనిస్వామి విశ్వాస పరీక్షలో నెగ్గిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష నేపథ్యంలో పళని, పన్నీరుసెల్వం వర్గాలు ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున డబ్బులు ఎరవేశారని తేలింది.
శశికళ ఆదేశాలతో...
నాడు విశ్వాస తీర్మానంలో పళనిస్వామిని ఓడించేందుకు పన్నీరుసెల్వం వర్గం, గెలిచేందుకు శశికళ వర్గం ఎత్తులు పై ఎత్తులు వేశాయి. ఇందులో భాగంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు పెద్ద మొత్తంలో డబ్బులు ఎరవేశారని స్టింగ్ ఆపరేషన్లో తేలింది. శశికళ కూడా బేరసారాలు చేసినట్లుగా తెలుస్తోంది.
రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు
విశ్వాస పరీక్షకు అనుకూలంగా ఓటు వేస్తే రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఎమ్మెల్యేలకు ఎర వేశారని స్టింగ్ ఆపరేషన్లో తేలింది. దాదాపు ముగ్గురు ఎమ్మెల్యేలకు రూ.10 కోట్లు ముట్ట చెప్పారని, కొందరికి రూ.6 కోట్లు, రూ.4 కోట్లు ముట్ట చెప్పారని తెలుస్తోంది.
పన్నీరు సెల్వం కూడా..
విశ్వాస పరీక్షలో పళనిస్వామిని ఓడించడం ద్వారా శశికళకు చెక్ చెప్పాలనుకున్న మాజీ సీఎం పన్నీరుసెల్వం వర్గం కూడా రూ.2 కోట్లు ఆఫర్ చేసిందని స్టింగ్ ఆపరేషన్లో తేలింది. శశికళ వర్గం బంగారం కూడా ముట్ట చెబుతామని చెప్పిందని తెలుస్తోంది. మొత్తానికి ఇరువర్గాలు పోటాపోటీగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు స్టింగ్ ఆపరేషన్లో తేలింది.
శరవణన్ ద్వారా వెలుగులోకి..
మధురై ఎమ్మెల్యే శరవణన్ ద్వారా ఈ అంశం తొలుత వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. గోల్డెన్ బే రిసార్టు నుంచి తొలుత బయట పడిన వ్యక్తి అతనే. రిసార్టులో శశికళ వేధింపులు తట్టుకోలేకపోతున్నామని చెప్పి ఆయన తప్పించుకొని వచ్చారు. ఇప్పుడు ఆయన ద్వారానే విషయం వెల్లడయింది.
బస్సులోనే ఆఫర్
పళనిస్వామిని విశ్వాస పరీక్షలో నెగ్గించేందుకు ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రిసార్టు నుంచి తరలించారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలు బస్సులో ఉన్నప్పుడు కూడా శశికళ వర్గం వారికి పెద్ద మొత్తంలో ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది.