లొంగిన శశికళకు షాక్: సాధారణ ఖైదీగానే.. అమ్మ సెల్ నో..
శశికళ పరప్పణ అగ్రహార జైలులో ప్రత్యేక న్యాయమూర్తి ముందు లొంగిపోయారు. ఆమె అమ్మ కారులోనే జైలుకు చేరుకున్నారు.
బెంగళూరు: కర్ణాటకలోని పరప్పణ అగ్రహారం జైలులో తనను గతంలో అమ్మ జయలలితకు కేటాయించిన సెల్ను కేటాయించాలని చిన్నమ్మ శశికళ కోరుతున్నారు. అమ్మ జయలలిత కారులోనే ఆమె చెన్నై నుంచి జైలుకు వచ్చారు. ఆమె కన్నా ముందే భర్త నటరాజన్, సీనియర్ నేత తంబిదురై జైలు ప్రాంగణానికి చేరుకున్నారు. ఆమె వెంట కారులో రవి అనే శాసనసభ్యుడు ఉన్నారు.
ఆమె కారును దాదాపు వంద కారులు అనుసరించాయి. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించి అదనపు సదుపాయాలు కల్పించాలని ఆమె కోరుతున్నారు. అన్నాడియంకె ప్రధాన కార్యదర్శిగా ఆమెకు కొన్ని సదుపాయాలు మాత్రం కల్పించే అవకాశం ఉంది.
ప్రత్యేక కోర్టుకు రావాల్సిన అవసరం లేదని, పరప్పణ అగ్రహార జైలుకు నేరుగా రావాలని అధికారులు శశికళకు సూచించారు. బెంగళూరులోకి ప్రవేశించకుండా హైవేపై నుంచి జైలు ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అవసరమైతే న్యాయమూర్తి అక్కడికే వస్తారని అంటున్నారు.
శశికళ లొంగిపోతున్నారని, అందువల్ల అరెస్టు వారంట్ జారీ చేయవద్దని అంతకు ముందు ఆమె తరఫు న్యాయవాది కోరారు. దానికి కోర్టు అంగీకరించింది. తాను ఎక్కడ ఉన్నా మనసు మాత్రం జయలలిత సమాధి వద్దే ఉంటుందని ఆమె అన్నారు.
బుధవారం సాయంత్రం 5.10 గంటలకు జైలు ప్రాంగణానికి చేరుకున్నారు. జైలు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. పెద్ద యెత్తున పోలీసు బలగాలను మోహరించారు. ప్రత్యేక న్యాయమూర్తి సమక్షంలో శశికళ లొంగిపోయారు. ఇళవరిసి, సుధాకరన్ కూడా లొంగిపోయారు.
శశికళ మూడున్నరేళ్ల పాటు పరప్పణ అగ్రహార జైలులో ఉంటారు. ఇంతకు ముందు ఆమె ఆరు నెలలు జైలులో ఉన్నారు. దాంతో నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధించినప్పటికీ మూడున్నరేళ్లు ఉంటే సరిపోతుంది. శశికళను సాధారణ ఖైదీగానే పరిగణిస్తామని అధికారులు చెబుతున్నారు.