రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో రిలీఫ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ ఊపిరి పీల్చుకున్నారు. పౌరసత్వ వివాదంపై రాహుల్ గాంధీ మీద వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) ను సోమవారం సుప్రీం కోర్టు కొట్టి వేసింది.
బ్రిటన్ లోని కంపెనీ లా అధికారుల ముందు తాను బ్రిటీష్ పౌరుడిని అంటూ రాహుల్ గాంధీ చెప్పారని, వెంటనే ఆయన పౌరసత్వ వివాదంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రముఖ న్యాయవాది ఎం.ఎల్. శర్మ సుప్రీం కోర్టులో పిల్ వేశారు.
ఈ పిల్ అత్యవసరంగా విచారించవలసినది కాదని గతంలో సుప్రీం కోర్టు చెప్పింది. అయితే సోమవారం ఈ పిల్ విచారణను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్. దత్తు, జస్టిస్ అమిత్ రాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటీషన్ ను విచారించింది.
ఈ పిల్ విచారణ చేసిన అనంతరం కొట్టి వేసింది. పిల్ తో పాటు రాహుల్ పౌరసత్వం పై జత చేసిన పత్రం ప్రామాణికతను ధర్మాసనం ప్రశ్నించింది. ఇలాంటి పిల్ వేసే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని పిటీషనర్ ను ధర్మాసనం నిలదీసింది.