యాకూబ్ మెమెన్కు ఉరి: భారత్ లో హై అలర్ట్
న్యూఢిల్లీ/ముంబై: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమెన్ అలియాస్ యాకూబ్ మెమెన్ ఉంటున్న నాగ్ పూర్ సెంట్రల్ జైలు దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముంబై నగరంతో పాటు మహారాష్ట్రలో అదనపు బలగాలను మోహరించారు.
బుధవారం యాకూబ్ మెమెన్ సమర్పించిన మెర్సీ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో యూకూబ్ మెమెన్ కు గురువారం ఉదయం 7 గంటలకు ఉరి శిక్ష అమలు చెయ్యనున్నారు. దీంతో భారతదేశంలోని అన్ని ప్రముఖ నగరాలలో హై అలర్ట్ ప్రకటించారు.
ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని, సున్నితమైన ప్రాంతాలలో గొడవలు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వార్గలు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. యాకూబ్ ను ఉరి తియ్యాలని బాంబు పేలుళ్లలో మరణించిన వారి కుటుంబ సభ్యులు 1,600 మంది సంతకాలు చేశారు.
యాకూబ్ ను శిక్షించాలని మహారాష్ట్ర ముఖ్యమత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఈనెల 30వ తేదిన యాకూబ్ మెమెన్ కు ఉరి శిక్ష అమలు చెయ్యాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. యాకూబ్ మెమెన్ ను ఉరి తియ్యడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
ఈ సమయంలో పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలోని దీనా నగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడులు చెయ్యడంతో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. యాకూబ్ మెమెన్ ను ఉరి తీస్తున్నారని ప్రతీకారంతో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
ముందు జాగ్రత చర్యగా యాకూబ్ మెమెన్ ఉంటున్న నాగ్ పూర్ సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాలలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. యాకూబ్ మెమెన్ ఉంటున్న బ్యారెక్ దగ్గర, జైలు పరిసర ప్రాంతాలలో సాయుధ బలగాలు మోహరిస్తున్నాయి.