ఎబిఎన్ నిలిపివేత: ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణలో ఏబీఎన్ ఛానెల్ ప్రసారాల నిలిపివేతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రసారాలను నిలిపివేస్తూ ఎంఎస్వోలు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించిందంటూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంలో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎంఎస్వోలతో పాటు మరో 15 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
అన్ని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్ సీపీ, ఎంఎస్వో అసోసియేషన్కు నోటీసులు అందజేసింది. వీటిపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏబీఎన్ దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు విచారణకు అంగీకరించింది. మొదటి పిటిషన్లో రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారన్న ఏబీఎన్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఎంఎస్వోలు ప్రైవేటు వ్యక్తులైనా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలన్న ఏబీఎన్ వాదనను కోర్టు అంగీకరించింది.
న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ ఈ విషయంపై స్పందిస్తూ ఆర్టికల్ 19 ప్రకారం హక్కులను భంగం కలిగించేందుకు కాకుండా ఇంకా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అని ఆయన ప్రశ్నించారు. అలాగే తెలంగాణలో ప్రసారాలను పునరుద్దరించాలంటూ ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషన్పై కూడా స్పందించిన సుప్రీం ఎంఎస్వోలు సహా 15 మందికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం
ఇదిలావుంటే, తెలంగాణలో ఏబీఎన్ ప్రసారాల నిలిపివేతపై హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం, ఎంఎస్వోలను హైకోర్టు ఆదేశించింది. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తెలంగాణలో గత ఐదు నెలలుగా ఏబీఎన్ ప్రసారాలను నిలిపివేయడంపై పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, ఎంఎస్వోలు బాధ్యత వహించాలంటూ మురళీ అనే వ్యక్తి హైకోర్టులు ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, ఎంఎస్వోలు కౌంటర్ దాఖలు చేయాలని గత వారం కోర్టు ఆదేశించినప్పటికీ కౌంటర్ దాఖలు చేయలేదు. ఈ అంశంతో సహా ప్రసారాలు నిలిపివేయడానికి గల కారణాలను పొందుపరుస్తూ కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, ఎంఎస్వోలకు హైకోర్టు ఆదేశించింది. దీనిపై మూడువారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించిన కోర్టు కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.