మరో దారుణం: పాఠశాల అమ్మాయిపై అత్యాచారయత్నం, హత్య
బెంగళూరు: పాఠశాలకు వెళ్తున్న బాలికను కిడ్నాప్ చేసిన నిందితులు అత్యాచారయత్నం చేసి చివరికి హత్య చేసి పరారైన సంఘటన కర్ణాటకలోని కుణిగల్ సమీపంలో జరిగింది. కుణిగల్ సమీపంలోని ఉజ్జని గ్రామంలో క్రిష్ణప్ప, శాంతమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతుల ద్వితీయ కుమార్తె శ్వేత (11). శ్వేత పిత్తలహళ్ళి (పిత్తలపల్లి)లోని అమ్మమ్మ ఇంటిలో నివాసం ఉంటున్నది.
గ్రామం సమీపంలోని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కదరాపుర గ్రామంలో స్కూల్లో శ్వేత ఆరవ తరగతి చదువుతున్నది. సోమవారం ఉదయం శ్వేత ఒంటరిగా స్కూల్ కు బయలుదేరింది. మార్గం మద్యలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శ్వేతను కిడ్నాప్ చేసి అటవి ప్రాంతం దగ్గరలోని నిర్జన ప్రదేశంలోకి తీసుకు వెళ్లి అత్యాచారయత్నం చేసి చివరికి గొంతు నులిమి హత్య చేసి అక్కడి నుండి పరారైనారు.
రాత్రి వరకు శ్వేత ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మంగళవారం వేకువ జామున నాలుగు గంటల వరకు గ్రామం పరిసర ప్రాంతాలలో గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం పశువులు కాపరి పొదలలో బాలిక శవం పడి ఉన్న విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఏఎస్పీ లక్ష్మణ్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హంతకులను పట్టుకొవడానికి ప్రతేక బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
కర్ణాటకలో ఇటీవల అత్యాచార ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి. ఈ విషయంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.