భారత్లో ఐసిస్ టార్గెట్ బీజేపీ, ఆరెస్సెస్ నేతలు: ఉగ్రవాదులపై అమెరికా భారీ రివార్డ్
న్యూఢిల్లీ: ఐసిస్, ఇతర ఉగ్రవాద సంస్థలు భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) నాయకులను లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ పోలీసులు నలుగురు తీవ్రవాదులను అరెస్టు చేశారు. వారి ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. పోలీసులను కూడా టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు.
బీజేపీ, ఆరెస్సెస్ నేతలు, పోలీసులే లక్ష్యంగా సాగుతున్న ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ కుట్రల వెనుక సూత్రధారి యూసఫ్ అల్ హిందీ అనే ఉగ్రవాది కాగా, మధ్యప్రదేశ్ రత్లాం ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ ఖాన్, వసీమ్, రిజ్వాన్, అన్వర్ ఖురేషీ అనే నలుగురు యువకులు పాత్రధారులు. కొన్నాళ్లుగా వీరు నలుగురూ యూసుఫ్తో ఆన్లైన్ చాటింగ్ చేస్తున్నారు.
అతడి సలహా మేరకు రెండు తుపాకులు కూడా సంపాదించారు. స్థానికంగా దొరికే పేలుడు పదార్థాలతో ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ (ఐఈడీలు) తయారు చేయడమూ నేర్చుకుంటున్నారు. వీరి ఆన్లైన్ చాటింగ్పై నిఘా వేసిన కేంద్ర భద్రతా సంస్థలు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, మధ్యప్రదేశ్ పోలీసులు వారిని అరెస్టు చేయడం ద్వారా ఈ కుట్రను భగ్నం చేయగలిగారు.
యూసఫ్ తొలుత అఫ్గాన్ నుంచి తన ఉగ్ర కార్యకలాపాలు నడిపేవాడని ఇటీవలే తన కార్యస్థానాన్ని సిరియాకు మార్చాడని, భారత్లో ఐసిస్ తరఫున ఉగ్ర చర్యలకు రూపకల్పన చేస్తున్నాడని తెలుస్తోంది. మరోవైపు, ఇటీవలే అతడు మరణించాడని, సోదరుడు షఫీనే యూసఫ్ పేరుతో అతడి ఈ-మెయిల్ ఖాతాలను నిర్వహిస్తున్నాడని తెలుస్తోంది.
రూ.127 కోట్ల రివార్డు
ఐసిస్ కీలక నేతలు నలుగురి తలలకు అమెరికా భారీ నజరానా ప్రకటించింది. వారి ఆచూకీ తెలిపిన వారికి రూ.127 కోట్లు బహుమానంగా ఇస్తామని పేర్కొంది. అబ్దుల్ రహ్మాన్ ముస్తఫా అల్ ఖాదులి, అబు మహ్మద్ అల్ అద్నానీ, తర్ఖాన్ తయుమురజోవిక్ బతిర్షావలీ, తారిక్ బిన్ అల్ తహర్ బిన్ అల్ ఫలీ అల్ అవ్నీ హర్జి తలలకు ఈ రివార్డును ప్రకటించింది.