డైరీ దెబ్బకు మైండ్ బ్లాక్: ఆమె ఓకే అంటే ఢిల్లీలో రెడీ, పన్నీర్ చేతిలో సీఎం జుట్టు !
తమిళనాడుకు చెందిన 12 మంది అవినీతి మంత్రుల మీద చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ కు ఆదాయపన్ను శాఖ అధికారులు లేఖ పంపించారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి నిద్రపట్టకుండా చెయ్యాలని ప్రత్యర్థులు అందరూ ఏకం అవుతున్నారని తెలిసింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఎడప్పాడి పళనిసామి ఇప్పుడు తన వర్గంలోని మంత్రులు చేసిన పనికి హడలిపోతున్నారు.
పళనిపామి ప్రభుత్వం పతనం ? పన్నీర్ సెల్వం చెప్పిన మరుసటి రోజే ఇలా !
ఇసుక కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులకు చిక్కిన డైరీ ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వాన్ని కుప్పకూల్చే అవకాశం ఉందని రాజకీయవిశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న పన్నీర్ సెల్వం సైతం ఎడప్పాడి ప్రభుత్వానికి చుక్కలు చూపించడానికి సిద్దం అయ్యారని తెలిసింది.
తిమింగలాలకు గాలం వేసిన ఐటీ శాఖ
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలోని అవినీతి తిమింగలాలను పట్టుకునేందుకు ఆదాయపన్ను శాఖ అధికారులు సిద్దం అయ్యారు. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ కు అవినీతి అధికారుల చిట్టాను అందజేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చెయ్యడానికి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు.
శేఖర్ రెడ్డి దెబ్బకు ప్రభుత్వం హడల్
ఇసుక కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డికి సహకరించి లబ్ధిపొందిన 12 మంది మంత్రులు మెడకు ఐటీ ఉచ్చు చుట్టుకునే అవకాశం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడు ప్రభుత్వంలో ప్రజాపనుల శాఖ కాంట్రాక్టులు తీసుకునేందుకు శేఖర్ రెడ్డికి ఈ 12 మంది మంత్రులు సహకరించారని ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు.
ఒక్క డైరీలో రూ. 300 కోట్ల లంచం చిట్టా
పెద్ద నోట్లు రద్దు అయిన తరువాత ఆదాయపన్ను శాఖ అధికారులు శేఖర్ రెడ్డి ఇంటిలో దాడులు చేసి రూ. 130 కోట్ల వరకు నగదు, కొన్ని కేజీల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో ఓ డైరీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు రూ. 300 కోట్ల వరకు ముడుపులు ఇచ్చానని స్వయంగా శేఖర్ రెడ్డి రాసిపెట్టిన వివరాలు అధికారులు గుర్తించారు.
శేఖర్ రెడ్డి అండ్ కో చెప్పారు
కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డితో పాటు ఆయన వ్యాపార భాగస్వాములు శ్రీనివాసులు, ఆడిటర్ ప్రేమ్ కుమార్, మహావీర్ గిరాణీ, పరస్మల్ లోథా, ఎం జైన్, రామచంద్రన్, అశోక్, రత్నంలను ఇప్పటికే అరెస్టు చేశారు. వీరందరిని విచారించిన ఆదాయపన్ను శాఖ అధికారులు శేఖర్ రెడ్డితో అక్రమ లావాదేవీలు జరిపిన వారిలో రాష్ట్ర మంత్రులతో పాటు ఉన్నతాధికారులు ఉన్నారని గుర్తించారు.
ఒక్కొక్కరి పేర్లు బయటకు
డైరీలోని వివరాల ఆధారంగా ఒక్కొక్కరి పేర్లు బయటకు తీస్తున్న ఆదాయపన్ను శాఖ అధికారులు రహస్యంగా విచారణ మొదలుపెట్టారు. ఆ వివరాలు మొత్తం తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ కు పంపించిన ఆదాయప పన్ను శాఖ అధికారులు దాడులు చెయ్యడానికి అనుమతి కోసం ఢిల్లీలో ఎదురు చూస్తున్నారు.
గుట్కా, మత్తు పదార్థాలు
పాన్ మసాలా, గుట్కా, మత్తు పదార్థాలు తమిళనాడులో నిషేధించిన తరువాత రహస్య అమ్మకాలకు మార్గం సుగమం చేసిన 50 మంది అధికారుల జాతకాలు ఆదాయపన్ను శాఖ అధికారుల చేతిలో ఉన్నాయి. ఆ పూర్తి వివరాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ కు పంపించి వారి మీద చర్యలు తీసుకోవాలని మనవి చేశారు.
12 మంది ఐపీఎస్ లు, 14 మంది ఐఏఎస్ లు
శేఖర్ రెడ్డి ఇంటిలో స్వాధీనం చేసుకున్న డైరీలో 12 మంది ఐపీఎస్ అధికారులు, 14 మంది ఐఏఎస్ అధికారుల జాతకాలు ఉన్నాయని వెలుగు చూసింది. వారి మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ కు ఆదాయ పన్ను శాఖ అధికారులు మనవి చేశారని వెలుగు చూసింది.
ఢిల్లీలో అధికారులు వెయిటింగ్
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ అనుమతి కోసం ఢిల్లీలో ఆదాయపన్ను శాఖ అధికారులు వేచి ఉన్నారు. ఆమె అనుమతి ఇచ్చిన వెంటనే చెన్నై చేరుకుని మంత్రులు, అధికారుల మీద దాడి చెయ్యడానికి సిద్దంగా ఉన్నారని తెలిసింది.
పన్నీర్ సెల్వం చేతిలో జుట్టు ?
పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గిరిజా వైద్యనాథన్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గిరిజా వైద్యనాథన్ విధులకు ఏరోజు పన్నీర్ సెల్వం అడ్డుపడలేదని తెలిసింది. ఈ సందర్బంలో పన్నీర్ సెల్వం గిరిజా వైద్యనాథన్ ను సంప్రధించి 12 మంది మంత్రుల మీద చర్యలు తీసుకోవాలని మనవి చేస్తే పళనిసామి ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశం ఉందని సమాచారం.