వేగంగా వస్తున్న రైలు ముందు సెల్ఫీ: ముగ్గురు బలి
ఆగ్రా: ఇటీవల కాలంలో యువత అద్భుతమైన సెల్ఫీలను తీసి సోషల్ మీడియా వెబ్ సైట్లో పోస్టు చేస్తున్న దృశ్యాలను మనం చాలా చూశాం. వేగంగా వస్తున్న రైలు ఎదుట నిలబడి సెల్ఫీ తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయాలన్న ప్రయత్నం ముగ్గురు స్నేహితుల ప్రాణాలను బలిగొంది.
ఈ ప్రమాదం కోసికాలాకు సమీపంలో ఉన్న మథుర రైల్వే ట్రాక్స్ వద్ద జరిగింది. ఢిల్లీ, మొరాదబాద్, ఫరీదాబాద్లకు చెందిన ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మరణించారు. వివరాల్లోకి వెళితే... నలుగురు మిత్రులు కలిసి రిపబ్లిక్ డే రోజున తాజ్ మహల్ చూసేందుకు ఆగ్రా బయల్దేరారు.
రైల్వే ట్రాక్ చూడగానే తమకు అక్కడ సాహసం చేయాలని అనిపించి కారు ఆపామని, వేగంగా వస్తున్న రైలు దగ్గర 'డేర్డెవిల్ సెల్ఫీ' తీసుకోవడానికి ఆగామని ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో బయటపడ్డ అనీష్ అనే నాల్గవ యువకుడు చెప్పాడు.
మరణించిన ముగ్గురి పేర్లు యాకూబ్, ఇక్బాల్, అప్జల్గా చెప్పాడు. రైలు రావడానికి కొద్దిక్షణాల ముందు ఫోటో తీసుకుని, అక్కడి నుంచి తప్పించుకుందామని అనుకున్నా... ఈలోపే వేగంగా వచ్చిన రైలు వారిని ఢీకొట్టిందని తెలిపాడు.
వీళ్లంతా 20-22 సంవత్సరాలు మధ్య వయసున్న వాళ్లే. మథురలోని కోసి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టంకు పంపారు.