ముస్లింల కోసమే పాక్, భారత్ హిందూ దేశమే: శివసేన ఎంపి
ముంబై: భారతదేశం ఎప్పుడూ లౌకకవాద దేశం కాదనీ, మనది హిందూ రాజ్యమేనని శివసేన పార్లమెంటు సభ్యుడు సంజయ్ రావత్ అన్నారు. అంతేకాకుండా రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో చేర్చిన లౌకిక, సామ్యవాద పదాలను శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పత్రికలకు జారీ చేసిన ప్రకటనలో పాత పీఠికనే ప్రచురించడంతో ఈ వివాదం మొదలైంది. ఈ ప్రకటనలో పాత పీఠిక ప్రచురించడంతో లౌకిక, సామ్యవాద పదాలు కనిపించలేదు. 42వ సవరణ చేయకముందున్న పీఠికను ప్రచురించడంతో ఈ పరిణామం ఎదురైంది.
పాత రాజ్యాంగ పీఠికను మాత్రమే పొరపాటున ఈ ప్రకటనలో వాడామని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి రాజవర్ధన్ రాథోడ్ వివరణ ఇచ్చారు. కాగా, ఇది పొరపాటు కాదు, మంచి పని చేశారని సంజయ్ రావత్ అన్నారు. ఇది భారత ప్రజలను గౌరవించే విధంగా ఉందని, పాత రాజ్యాంగ పీఠికనే అనుసరించండని శివసేన ఎంపి డిమాండ్ చేశారు.
భారత్ సెక్యూలర్ దేశం కాబోదని, మత పరంగానే భారత్, పాకిస్థాన్లు విడిపోయాయని చెప్పారు. ముస్లింల కోసమే పాకిస్థాన్ ఏర్పాటు చేయబడింది, మిగితా భారత్ హిందూ దేశమే అని రావత్ తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు ముస్లింలను రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారని ఆరోపించారు.