రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ప్రకంపనలు: శంకర్ స్థానికతపై సవాళ్లు
తమిళ సూపర్స్టార్ రజనీకాంత రాజకీయ అరంగేట్రం వ్యవహారం మరింత ముదురుతోంది. వ్యతిరేకులు, అనుకూలురు సమీక్రుతమవుతున్న తరుణంలో ‘తలైవా’ సొంత పార్టీ పెడతారా? బీజేపీలో చేరతారా?
చెన్నై: తమిళ సూపర్స్టార్ రజనీకాంత రాజకీయ అరంగేట్రం వ్యవహారం మరింత ముదురుతోంది. వ్యతిరేకులు, అనుకూలురు సమీక్రుతమవుతున్న తరుణంలో 'తలైవా' సొంత పార్టీ పెడతారా? బీజేపీలో చేరతారా? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతున్నది. ఇటీవల అభిమానులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఆయన రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్టు తెలుస్తున్నది.
ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి అవసరమైన కార్యాచరణ కూడా మొదలెట్టేశారని.. మరో పది రోజుల్లో రజనీకాంత్ రాజకీయ ప్రస్థానంపై సానుకూల ప్రకటన చేసే ఛాన్సుందని కోడంబాక్కం వర్గాలు కోడై కూస్తున్నాయి.
అదే సమయంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశంపైన.. దాని ఆవశ్యకతపై తమిళనాడుతోపాటు యావత్ భారతావని అంతటా ఎడతెగని చర్చ జరుగుతున్నది. సినీ వర్గాల నుంచి రాజకీయ పార్టీల నేతల వరకు ప్రతి ఒక్కరూ సానుకూలంగా, ప్రతికూలంగా ప్రతిస్పందిస్తున్నారు. ఆయన సొంతంగా పార్టీ పెడతారా? బీజేపీలో చేరతారా? అన్న కోణంలోనూ నిశితంగా గమనిస్తున్నారు.
ఆచితూచి రజనీ అడుగులు
అంతా ఊహించినట్లే తమిళనాట రజనీకాంత్ రజనీకాంత్ రంగ ప్రవేశం ఖరారైతే ‘తలైవా'కు ఉన్న అభిమాన జన ‘ధనం' మద్దతుతో మొత్తం రాష్ట్ర రాజకీయాలనే సమూలంగా మార్చివేయగల శక్తి సామర్థ్యాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అన్నాదురై.. కరుణానిధి... ఎంజీఆర్ తరహాలో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను ఊపివేస్తాయా? లేదా? అన్న సంగతి ఇప్పటికిప్పుడు చెప్పడం తొందరపాటే అవుతుందే కానీ.. తమిళనాట కీలక శక్తిగా అవతరిస్తారని మాత్రం విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.
అయితే రజనీకాంత్ మాత్రం ఆచితూచి అడుగేయాలని.. ఒక్కసారి రాజకీయాల్లోకి వస్తే ఎదురయ్యే సమస్యలు, పరిణామాలపై బేరీజు వేసుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, తమిళనాట కెప్టెన్ విజయ్ కాంత్ పరిస్థితి తరచి చూసుకుంటున్నారని తెలుస్తున్నది. ఇదిలా ఉంటే అల్లుడు ధనుష్ రజనీకాంత్కి ధైర్యం ఇస్తున్నారని.. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నారని సమాచారం. అల్లుడి స్థానంలో ఉంటూ రజనీకాంత్ కుమారుడిలా అన్ని విధాలా అతనే సాయం చేస్తున్నాడని సన్నిహితులు చెప్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానంటే స్వాగతిస్తానని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి అన్నారు.
వ్యతిరేకులకు పోటీగా అభిమానుల ఆగ్రహం
రజనీకాంత్ మాత్రం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని ఒక గ్రామం తన సొంతూరు అని గతవారం ప్రకటించారు. రజనీకాంత్ అభిమానులు కూడా తక్కువ తినలేదు. స్థానికుడు కాదని సినీనటుడు రజనీకాంత్ తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి వీలు లేదని స్థానిక సంఘాలు నిరసన చేయడంపై ఆయన అభిమానులు భగ్గుమన్నారు. ఫ్యాన్స్ మీట్లో 'నేను లోకల్' 40 ఏళ్ల పాటు తమిళనాడులో ఉన్నానన్న రజనీకాంత్కు నిరసన సెగ తగిలింది.
కానీ అమెరికాలో ఐదేళ్లు ఉంటేనే గ్రీన్ కార్డు ఇస్తుంటే.. రజనీకాంత్ 40 ఏళ్ల పాటు తమిళనాడులో ఉన్నారని.. తమిళ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్న వ్యక్తిని దెబ్బతీసేందుకు కొన్ని గ్రూపులు ప్రయత్నిస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. చెన్నైలో మంగళవారం ఆందోళనకారులు దిష్టిబొమ్మను తగులబెట్టేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. రజనీ రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకునే వారికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మ తగులబెట్టడానికి ప్రయత్నించామని, ఏ ఒక్కరూ తమ లక్ష్యం కాదని ఆందోళనకు నేతృత్వం వహించిన రజనీ అభిమాని సత్య అన్నారు.
అభిమానుల సానుకూల స్పందన ఇది
‘ద్రవిడం' పాళ్లు ఎక్కువగా ఉన్న తమిళ సోదరుల్లో ప్రత్యేకించి కొన్ని సంస్థల్లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం పట్ల వ్యతిరేకత కనిపిస్తున్నది. తమిళనాట ప్రాధాన్యం గల ప్రజా సంఘాలు రజనీ కాంత్ నివాసం వద్ద నిరసనకు దిగారు. కన్నడిగుడు అయిన రజనీ తమిళనాడు రాజకీయాల్లోకి రాకూడదనే డిమాండ్తో తమిళర్ మున్నెట్ర పడాయి ఆధ్వర్యంలో స్థానికులు ఆయన నివాసం ఎదుట ఆందోళన చేశారు. తమిళర్ మున్నేట్రపడై నాయకురాలు వీరలక్ష్మి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. మరికొన్ని తమిళ సంఘాలు కూడా సూపర్స్టార్ రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకించాయి.
సినీ రంగ ప్రముఖులు కూడా వ్యతిరేక, అనుకూల వర్గాలు చీలిపోవడం కద్దు. తమిళనాడుకు తమిళుడే సీఎం కావాలని దర్శక దిగ్గజం భారతీ రాజా అన్నారు. ‘రాష్ట్రంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. కానీ తమిళుడే తమిళనాడును పాలించాలి. ఈ విషయంలో యువత సంఘటితంగా ఉండాలి. ఓ తమిళుడు మరో రాష్ట్రంలో సీఎం పీఠమెక్కగలడా? మనం మాత్రం ఎందుకు దీనిని సహించాలి?' అని భారతీరాజా నిలదీశారు. మాజీ సీఎం జయలలిత మేనకోడలు, ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై వ్యవస్థాపకురాలు కూడా రజనీపై వ్యంగ్యాస్త్రాలు వేశారు. కావేరి జల వివాదంపై రజనీ తన వైఖరిని వెల్లడించగలరా? తమిళ ఈలంపై వ్యాఖ్యలు చేయగలరా? అని మండిపడ్డారు. సినీ రంగంలోనే బోలేడు సమస్యలు ఉన్నాయని, ఆయన వాటిపై ఫోకస్ చేస్తే మంచిదని ఆమె సలహా ఇచ్చారు.
పళని, పన్నీర్లకు ఇక చుక్కలే
ఇక తలైవా రాజకీయ ప్రవేశంతో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్, ఏఐఏడీంకేలోని మాజీ సీఎం పన్నీర్సెల్వం, సీఎం పళనిస్వామిలాంటి నాయకుల జాతకాలు తారుమారయ్యే అవకాశాలు ఉంటాయని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దివంగత సీఎం జయలలిత లేని లోటు, సమర్థ నాయకుడు లేని వైనంతో తమిళనాట విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. డీఎంకే అధినేత కరుణానిధి సైతం వృద్ధాప్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండటం, అమ్మ లేకపోవడంతో.. ప్రజలు తమను పరిపాలించే బలమైన నేత ఎవరా అని వేయి కనులతో ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్, రాష్ట్ర రాజకీయాల్లో నాలుగైదు దశాబ్దాలుగా కొనసాగుతున్న రెండు పార్టీల గుత్తాధిపత్యానికి గండికొట్టవచ్చు. డీఎంకేలో స్టాలిన్ ఇంకా తనను తానుగా నిరూపించుకోలేదు. అన్నాడీఎంకే రెండుగా చీలిపోయిన తరుణంలో రాజకీయ రంగ ప్రవేశం చేయడం ‘తలైవా'కు సరైన తరుణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆచితూచి స్పందిస్తున్న బీజేపీ
కానీ తమిళనాడు ప్రజల నాడి తెలుసుకునేందుకే వ్యవస్థలో మార్పు కోసం రజనీకాంత్ రాజకీయ ప్రకటన చేసి ఉండొచ్చుననే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. కానీ రజనీకి మోదీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రజనీ చాలా ఏళ్లుగా బీజేపీతో సంబంధాలు కొనసాగిస్తున్నా, అవి రాజకీయమైనవి కావని బీజేపీ తమిళనాడు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఎల్ గణేశన్ వ్యాఖ్యానించారు. తొలుత ఆయన్ను రాజకీయాల్లోకి రావాలో వద్దో తేల్చుకోనివ్వండని, కానీ బీజేపీ మాత్రం సరైన వ్యక్తుల కోసం ఎదురుచూస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు.
రజనీకాంత్ బీజేపీలో చేరితే ఆ పార్టీకి లాభించవచ్చునని తమిళనాడు రచయిత, పాత్రికేయుడు సుధాగన్ అన్నారు. అదే బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి మాత్రం రజనీకాంత్ రాజకీయాలకు పనికి రాడని, అసలు తమిళుడే కాదని పుల్లవిరుపు మాటలు మాట్లాడారు. మొత్తం మీద రజనీ తీసుకోబోయే నిర్ణయం, తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులకు దారి తీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.