నిత్య పెళ్లి కొడుకు మాయల మరాఠీ చిక్కాడు
ముంబై: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ దగ్గర రూ 9 లక్షలు తీసుకుని మాయం అయిన నిత్య పెళ్లి కొడుకుని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన వినాయక్ నంగారే (50) అనే వ్యక్తిని లక్నోలో అరెస్టు చేశామని పోలీసు అధికారి అనీల్ దేశ్ ముఖ్ చెప్పారు.
ఇతను ముంబై, థానే, అహమ్మద్ నగర్, ఔరంగాబాద్, నాశిక్ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో మహిళలను మోసం చేసి పెళ్లిళ్లు చేసుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పెళ్లి చేసుకుని వారి దగ్గర నగలు, నగదు లూటీ చేసిన తరువాత ముఖం చాటేస్తున్నాడు.
2015 డిసెంబర్ లో కోలాపూర్ ప్రాంతంలో పెళ్లి చేసుకుంటానని ఓ ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసిన ఓ మహిళ స్పందించారు. ఇద్దరు కలుసుకున్నారు. దగ్గరైన ఇద్దరు ఒకే ఇంటిలో కాపురం పెట్టారు.
తాను పెట్రోల్ బంక్ పెట్టాలని నిర్ణయించానని, అందుకు రూ. 12 లక్షలు అవసరం అవుతుందని ఆమెకు చెప్పాడు. పలు సందర్బాల్లో ఆమె దగ్గర రూ 9 లక్షలు తీసుకున్నాడు. తరువాత ఆమెకు కనపడకుండా మాయం అయ్యాడు.
మోసం జరిగిందని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ ప్రాంతాల్లో వినాయక్ నంగారే కోసం గాలించారు. చివరికి లక్నోలో ఆ మాయల మరాఠీని అరెస్టు చేశామని పోలీసు అధికారి అనీల్ దేశ్ ముఖ్ తెలిపారు.