యూనివర్సిటీలో ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
బెంగళూరు: దేశంలోనే ప్రసిద్ది చెందిన మైసూరు విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపులు చేస్తున్నారని ఒక పీహెచ్ డీ విద్యార్థిని మైసూరు నగరంలోని విజయనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైసూరు నగర పోలీసులు ప్రొఫెసర్ మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
మైసూరు విశ్వవిధ్యాలయంలో డాక్టర్ జి వెంకటేష్ కుమార్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఈయన దగ్గర ఒక యువతి రిసర్చ్ స్కాలర్ (పీహెచ్ డీ విద్యార్థిని)గా చదువుకుంటున్నది. అయితే, తన మీద గురువు వెంకటేష్ లైంగిక వేదింపులకు పాల్పడ్డాడని, రెండు సంవత్సరాల నుండి వేధిస్తున్నాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విజయనగర పోలీసులు డాక్టర్ జి వెంకటేష్ కుమార్ మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశారు. యువతికి వైద్య పరీక్షలు చేయించారు. బాధితురాలి దగ్గర స్టేట్ మెంట్ తీసుకుని విచారణ చేస్తున్నామని మైసూరు నగర పోలీసు అధికారులు తెలిపారు.
గతంలో మైసూరు యూనివర్శిటీలోనే ప్రొఫెసర్ లుగా పని చేస్తున్న వారి మీద అనేక సార్లు ఇలాంటి లైంగిక వేదింపుల ఫిర్యాదులు వచ్చాయి. ఆ సమయంలో ప్రొఫెసర్ శివబసయ్య, ప్రొఫెసర్ రంగరాజులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని విచారణలో వెలుగు చూసింది.