మోడీని పిలవను, ఇష్టంలేదు: బుఖారీ, షరీఫ్కి ఆహ్వానం
న్యూఢిల్లీ: జమా మసీదు షాహీ ఇమాం సయ్యద్ అహ్మద్ బుఖారీ తన కుమారుడిని నయీబ్ షాహీ ఇమాం (ఉప ఇమాం)గా ప్రకటించే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించలేదు. నవంబర్ 22వ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, మన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అహ్మద్ బుఖారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్తో పాటు భారత్లోని ప్రముఖ నేతలందరినీ ఈ వేడుకకు ఆహ్వానిస్తానని చెప్పిన బుఖారీ... మోడీని మాత్రం పిలవబోనన్నారు. తాను ఎవరిని ఆహ్వానించాలనేది పూర్తిగా తన ఇష్టమన్నారు.
తన మనసులో మోడీకి ఏమాత్రం చోటు లేదన్నారు. ఆయన తమను ఇష్టపడరని, తాము ఆయనంటే అభిమానం చూపమన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముస్లింలకు చేసిందేమీ లేదన్నారు. 2002 నాటి గుజరాత్ దాడులకు ఈ దేశపు ముస్లింలు ఎన్నటికీ మోడీని క్షమించరని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలోని చారిత్రక జామా మసీదు ఇమాం సయ్యద్ అహ్మద్ బుఖారీ నవంబరు 22న తన కుమారుడిని ఉత్తరాధికారిగా ప్రకటించనున్నారు. కుమారుడైన 19 ఏళ్ల షాబాన్ను తదుపరి ఇమాంగా ప్రకటించే ఈ వేడుకను బుఖారీ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
దీనికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో బాటు పలు ముస్లిం దేశాధినేతలు, మత పెద్దలు తరలి రానున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నవంబర్ 29న బుఖారీ ఇస్తున్న విందుకు ఇప్పటికే హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్లకు ఆహ్వానం అందింది.
దీని పైన బీజేపీ ఘాటుగా స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ఇమాం ఎలాంటి సందేశాన్ని ఇవ్వదల్చుకున్నారని బీజేపీ మండిపడింది. భారతీయ ముస్లీంలు ఇక్కడే పుట్టారని, భారత్నే వారు ప్రేమిస్తారన్నారు. పాకిస్తాన్ గురించి దాదాపుగా ఆలోచించరన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చెప్పదల్చుకున్నారన్నారు.