ఆశ్యర్యం: ‘‘కార్గోలో వచ్చింది.. బిజినెస్ క్లాస్లో వెళ్తోంది.. బరువు తగ్గినట్లా? కాదా?’’
ఈజిప్షియన్ భారీకాయురాలు ఎమాన్ అహ్మద్ గుర్తుందా? సుమారు 500 కేజీల బరువుతో చికిత్స కోసం మనదేశానికి ఛార్టర్డ్ కార్గో విమానంలో వచ్చిన ఈమె మొత్తానికి బాగానే బరువు తగ్గింది. ప్రస్తుతం ఆమె బరువు 176 కేజీ
ముంబయి: ప్రపంచంలోనే అత్యధిక బరువు కలిగిన ఈజిప్టు మహిళ ఎమాన్ అహ్మద్ ముంబయిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చికిత్స అనంతరం సగానికిపైగా బరువు తగ్గిన ఆమెను యూఏఈకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గతంలో సుమారు 500 కేజీల బరువుతో ఉన్న భారీకాయురాలిని ఛార్టర్డ్ కార్గో విమానంలో ముంబయికి తీసుకువచ్చారు. అయితే ప్రస్తుతం ఆమె బరువు 176 కేజీలు మాత్రమే. దీంతో ఇప్పడు ఆమెను సాధారణ విమానంలో బిజినెస్ క్లాస్ ప్యాసింజర్గా అబుదాబికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దీనిపై ముంబయి సైఫీ ఆస్పత్రికి చెందిన బేరియాట్రిక్ సర్జరీ సెక్షన్ చీఫ్ అపర్ణా భాస్కర్ మాట్లాడుతూ 'ఎమాన్ను ఛార్టెడ్ కార్గో విమానంలో ఇక్కడకు తీసుకువచ్చారు. ఇప్పుడు చికిత్స అనంతరం విమానంలో బిజినెస్ క్లాస్లో ఆమెను తరలిస్తున్నాం. గత ఏడాది సెప్టెంబర్లో 500 కేజీల బరువున్న ఆమె.. ప్రస్తుతం 176.6 కేజీలు మాత్రమే ఉన్నారు. మరి బరువు తగ్గినట్లా? కదా? ' అని వ్యాఖ్యానించారు.
ఎమాన్ను అబుదాబిలోని బూర్జిల్ ఆస్పత్రికి తరలించనున్నారు. వీపీఎస్ హెల్త్కేర్ గ్రూప్లో భాగమైన ఈ ఆస్పత్రి వైద్యులు బుధవారం ముంబయిలో ఎమాన్ను ఆమె సోదరి షైమా అభ్యర్థన మేరకు పరిశీలించారు. అబుదాబిలో ఆమెకు రెండో దశ ఫిజియోథెరపీని కొనసాగించనున్నారు.
ఎమాన్కు అందిస్తున్న వైద్యంపై ఆమె సోదరి షైమా ఇటీవల వైద్యులపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎమాన్ బరువు తగ్గలేదని, వైద్యులు అబద్దం చెబుతున్నారని షైమా పేర్కొన్న నేపథ్యంలో వైద్యులు ఎమాన్ ను పరిశీలించారు.