హీనా హత్య ఎందుకు: సోదరుడి అరెస్ట్, ఇంద్రానీ పేరు అది కాదు!
ముంబై: హీనా బోరా హత్య ఆస్తి కోసం జరిగిందా లేక రాహుల్తో రిలేషన్ షిప్ వల్ల జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఆస్తి కోసమే కూతురు షీనానే ఇంద్రానీ హత్య చేసిందని, అనంతరం టార్గెట్ తన కొడుకు మిఖాయిల్ అని తెలుస్తోంది.
తన కూతురును మూడో భర్తకు సోదరిగా, కొడుకును సోదరుడిగా పరిచయం చేయడం గమనార్హం. అదే సమయంలో తన మూడో భర్త పీటర్ ముఖర్జియా తనయుడు రాహుల్ ముఖర్జియాతో రిలేషన్ షిప్ వల్లనే ఇంద్రానీ కూతురుని హత్య చేసిందనే వార్తలు వస్తున్నాయి.
పోలీసుల అదుపులో షీనా బోరా సోదరుడు
తన సోదరి షీనా బోరా హత్య నేపథ్యంలో తన తల్లి ఇంద్రాణికి హెచ్చరికలు జారీ చేసిన మిఖాయిల్ బోరాను పోలీసులు డిస్పూర్లో అదుపులోకి తీసుకున్నారు. షీనా బోరా హత్య గురించి తనకు తెలుసునని, తన తల్లి నిజాలు చెప్పాలని, లేదంటే తానే బయటపెడతానని ఆయన చెప్పారు.
అతనిని ప్రాథమిక విచారణ కోసం పోలీసు స్టేషన్కు తీసుకు వచ్చారు. కాసేపు అతనిని ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్టు చేశారు. షీనా బోరా కేసులో పోలీసులు సమగ్ర విచారణ చేస్తున్నారు. పలువురిని వరుసగా అదుపులోకి తీసుకుంటున్నారు.
ఇంద్రాని అసలు పేరు కాదు
షీనా బోరా హత్య కేసులో నిందితురాలిగా ఉన్న తల్లి ఇంద్రానీ జీవితంలో ఎన్నో కొత్త కోణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆమె అసలు పేరు ఇంద్రానీ కాదని... పారీ బోరా అని తెలుస్తోంది. ఆమె ఉపేన్ బోరా కుమార్తె. అందుకే షీనా పేరులో బోరా తొలగిపోలేదు.
తన పదహారవ ఏట వరకూ గౌహతీ పరిధిలోని సుందర్ నగర్లో తల్లిదండ్రులతో కలసి నివసించిన పారీ బోరా (ఇంద్రానీ) 1988లో ఇల్లు విడిచి పారిపోయింది. ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియదు. రెండేళ్ల అనంతరం 1990లో తిరిగి ఇంటికి వచ్చిన ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు.
వారు కూతురు షీనా బోరా, తనయుడు మిఖాయిల్ బోరా. ఆమెకు చాలా చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలు కలిగారు. వీరిద్దరూ సిద్ధార్థ దాస్కు, తనకు పుట్టారని ఆమె చెప్పుకుంది. వీరిద్దరికీ తాను తండ్రిని కాదని దాస్ వాదించేవాడని తెలుస్తోంది.
ఈ విషయంలో డీఎన్ఏ పరీక్షలకూ దాస్ సిద్ధపడటం, ఆ తర్వాత విడిపోవడానికి కూడా కారణమైంది. ఆ తర్వాత గొడవలు తన పిల్లలకు పేర్ల చివరన దాస్ అని కాకుండా, బోరా అనే ఉంచింది. అనంతరం పందొమ్మిదవ ఏట సంజీవ్ ఖన్నాను ఇంద్రాని పేరిట పరిచయం చేసుకుంది.
ఇద్దరూ ప్రేమలో పడి వివాహం చేసుకోవాలని భావించారు. తన తొలి వివాహం గురించి చెప్పకుండానే 1993లో సిద్ధార్థ దాస్తో విడాకులు తీసుకుని సంజీవ్ను పెళ్లి చేసుకుంది. సిద్ధార్థతో తెగతెంపుల అనంతరం పీటర్ ముఖర్జియాకు దగ్గరైంది. సంజీవ్ ఖన్నా, సిద్ధార్థ దాస్, పీటర్ ముఖర్జియాలు కాకుండా మరో వ్యక్తి ఇంద్రానీ జీవితంలో ఉన్నాడు. అతడు షీనా బోరా, మిఖాయిల్ బోరాలకు తండ్రి కావొచ్చని, అతడెవరో తెలియాల్సి ఉంది.