అనుకోని మలుపు: షీనా బతికే ఉంది, ఇంద్రాణి షాకింగ్
ముంబై: షీనా బోరా హత్య కేసులో మరో ట్విస్ట్. ఇన్నాళ్లు హత్య గావించబడిందని భావిస్తున్న షీనా బోరా బతికే ఉందా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి. తన కూతురు షీనా బతికే ఉందని, అమెరికాలో ఉందని ఇంద్రాణి పోలీసుల విచారణలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది.
ఆంగ్ల మీడియాలో ఇందుకు సంబంధించి జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇంద్రాణీ కేసులో ఇది అనుకోని మలుపు అని చెప్పవచ్చు. తాను తన బిడ్డ షీనా బోరాను చంపలేదని, ఆమె అమెరికాలో బతికేవుందని, తనంటే ద్వేషంతోనే షీనా బయటకు రావడం లేదని పోలీసుల విచారణలో ఇంద్రాణి వెల్లడించినట్లుగా తెలుస్తోంది.
షీనా హత్యకు గురైన దాదాపు మూడేళ్లకు షీనాను, అమె రెండో భర్త సంజీవ్ ఖన్నాను, కారు డ్రైవర్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇంద్రాణి విచారణలో చెబుతున్న విషయాలతో, పోలీసులే తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ కేసులో ఎలా ముందుకు సాగాలా? అని ఆలోచిస్తున్నట్టు ముంబై పోలీసు వర్గాలు వెల్లడించారు. షీనా బతికే ఉందని ఇంద్రాణి చేస్తున్న వాదనను నమ్మడం లేదని, ఆమె అమెరికా ప్రయాణించిందని చెబుతున్న సమయంలో విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.
షీనా సెల్ఫోన్ను ఇంద్రాణి సంవత్సరం పాటు వాడిందనేందుకు, ఆ సెల్ నుంచి రాహుల్ ముఖర్జియాకు మెసేజ్లు వెళ్లాయని తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసును కొలిక్కి తీసుకొస్తామంటున్నారు.
మరోవైపు, కొడుకును విషం పెట్టి చంపాలని చూసినందున, ఇంద్రాణి పైన మరిన్ని సెక్షన్ల కింద కేసులు పెడుతున్నట్టు పోలీసులు చెప్పారు. కాగా, షీనా కేసులో నిందితులకు రిమాండ్ మరో ఐదు రోజులు పొడిగించారు.
షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీతోపాటు మిగతా నిందితులను సోమవారం ముంబయ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్రాయ్లకు సెప్టెంబర్ 5 వరకూ పోలీసు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఎస్ఎం చాంద్గడే ఆదేశాలు జారీ చేశారు.
హత్య చేస్తే ఇంద్రాణిని ఉరి తీయాలి: షీనా తండ్రి
తన కూతురు షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జియా హత్య చేస్తే కనుక ఆమెను ఉరి తియాలని షీనా బోరా తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.