ట్విస్ట్: హత్య తర్వాత షీనా రిజైన్? ప్రియుడికి బ్రేకప్ మెసేజ్
ముంబై: షీనా బోరా కనిపించకుండా పోయినప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు స్టార్ ఇండియా మాజీ సీఈవో పీటర్ ముఖర్జీయా కుమారుడు రాహుల్ ముఖర్జీయాను ప్రశ్నించారు. అతనిని పోలీసులు బుధవారం రాత్రి ఒకసారి, గురువారం మరోసారి ప్రశ్నించారు.
ఊహించని మలుపులు తిరుగుతూ, సంచలనాలకు కేంద్రబిందువుగా షీనా బోరా హత్య కేసు మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా రాహుల్ను రెండుసార్లు ప్రశ్నించారు.
షీనా కనిపించకుండా పోయినప్పుడు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అడిగారు. దాదాపు సంవత్సరం పాటు షీనా బోరా, రాహుల్ ముఖర్జియాలు రిలేషన్ షిప్లో ఉన్నారు. పీటర్ ముఖర్జియాకి రాహుల్ కుమారుడు కాగా, పీటర్ భార్య ఇంద్రాణి ముఖర్జియాకి షీనా కుమార్తె. తన తొలి భర్త ద్వారా ఇంద్రాణికి షీనా జన్మనిచ్చింది. ఇంద్రాణికి పీటర్ మూడవ భర్త.
చివరగా బ్రేకప్ మెసేజ్
షీనా బోరా తనకు చివరిసారి బ్రేకప్ మెసేజ్ ఇచ్చిందని రాహుల్ ముఖర్జీయా చెప్పాడని తెలుస్తోంది. అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయిందని చెప్పారు. అంతేకాకుండా, షీనా ఎక్కడకు వెళ్లిందని తాను ప్రశ్నించిన ప్రతిసారి ఆమె వెంటబడటం మానుకోమని ఇంద్రాణి చెప్పేదని పోలీసులకు చెప్పాడని తెలుస్తోంది.
చివరిసారిగా 2012 ఏప్రిల్ 24న ఆమె తన తల్లితో బయలుదేరడానికి కొద్ది గంటల ముందు మాత్రమే రాహుల్ ఆమెనుకలిశాడని, ఇక అప్పుడే చివరిసారని వివరించాడని తెలుస్తోంది.
షీనా రాజీనామా లేఖ
షీనా బోరా హత్యకు గురైన కొద్ది రోజుల అనంతరం తాను పని చేసే కార్యాలయంలో ఓ స్నేహితురాలికి రాజీనామా లేఖ పంపించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది అనుమానాలకు తావిస్తోంది. 2012 ఏప్రిల్ 24న షీనా హత్యకు గురైతే రాజీనామా లేఖ మే నెలలో వచ్చినట్లుగా తెలుస్తోంది.
1990లో అసోం నుంచి తల్లి ఇంద్రాణితో కలిసి ముంబైకి వచ్చిన షీనా బోరా బిఏ ఎకనామిక్స్ చేసింది. 2011 జూన్లో రిలయన్స్ ముంబై మెట్రో సంస్థలో ఉద్యోగం పొందింది. ఆ తర్వాత ఆ ఉద్యోగం మానేసింది. ఆ తర్వాత ఫేస్ బుక్ అకౌంటును కూడా క్లోజ్ చేసిందని తెలుస్తోంది.