‘‘ఉగ్రవాదులకు అనుమతిచ్చి.. సామాన్యులకు ఆంక్షలా?’’
విమానయాన సంస్థల తీరుపై గురువారం శివసేన ఎంపీలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులను ఎక్కించుకుంటాయిగానీ సామాన్యులపై ఆంక్షలు విధిస్తాయంటూ మండిపడ్డారు.
న్యూఢిల్లీ: ఉగ్రవాదులను తమ విమానాల్లో ఎక్కించుకోవడానికి అనుమతిస్తున్న విమానయాన సంస్థలు సామాన్యులపై మాత్రం ఆంక్షలు విధిస్తున్నాయంటూ శివసేన తీవ్రంగా విరుచుకుపడింది.
విమానయాన సంస్థలు గూండాల్లా వ్యవహరిస్తున్నాయంటూ మండిపడింది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పై విధించిన నిషేధం విషయంలో దేశీయ విమానయాన సంస్థలు ఏమాత్రం వెనక్కి తగ్గని నేపథ్యంలో శివసేన ఎంపీలు గురువారం లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిసి ఈ అంశంపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎంపీలు విమానయాన సంస్థలపై దుమ్మెత్తిపోశారు. ఎంపీలతో తప్పుగా ప్రవర్తించినందుకు మొదట ఎయిరిండియానే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గైక్వాడ్ చేసిన తప్పేమిటన్నారు.
ఎయిర్ లైన్స్ కంపెనీల ప్రవర్తన మాఫియా గూండాలను తలపిస్తోందని, ఆయా సంస్థల పరిధిలో ఏదైనా జరిగితే చూడాల్సిన బాధ్యత ఆ కంపెనీలకు లేదా అని ప్రశ్నించారు. తామిప్పుడు లోక్ సభ స్పీకర్ ను కలువబోతున్నామని, అందుకే ఎక్కువగా ఈ విషయం గురించి మాట్లాడడం లేదని శివసేన నేత సంజయ్ రావత్ వ్యాఖ్యానించారు.
గత గురువారం పూణె-న్యూఢిల్లీ విమానంలో తనకు బిజినెస్ క్లాస్ ను నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా మేనేజర్ పై దాడి చేసిన విషయం విదితమే.
ఈ సందర్భంలో గైక్వాడ్ ఆయన్ని 25 సార్లు చెప్పుతో కొట్టాడు. ఎంపీ దుష్ర్పవర్తన ఎయిరిండియాను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో గైక్వాడ్ పై ఎయిరిండియా సహా ఐదు ప్రైవేటు విమానయాన సంస్థలు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించింది.