అమీర్ ఖాన్ని కొట్టే ప్రతి చెంప దెబ్బకి రూ.లక్ష: శివసేన
ముంబై: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యల పైన చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మద్దతు పలుకుతున్నారు. శివసేన అమీర్ ఖాన్ పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
భారత్లో ఏ ఉపద్రవం వచ్చిందో అమీర్ ఖాన్ చెప్పాలని డిమాండ్ చేసింది. అమీర్ ఖాన్ నమ్మకద్రోహుల భాషలో మాట్లాడుతున్నారని శివసేన విరుచుకుపడింది. ఈ మేరకు తమ పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది. అందులో అమీర్ ఖాన్ పైన మండిపడింది.
భారత్ తమ దేశం కాదనుకున్నవారు దేశభక్తి గురించి, సత్యమేవ జయతే గురించి మాట్లాడకూడదని ఆక్షేపించింది. దేశంలో అసహనం ఉందని అమీర్ ఖాన్ భావిస్తే తన చిత్రాలను దేశం వెలుపల విడుదల చేసుకోవాలని సూచించింది.
శివసేన పంజాబ్ చైర్మన్ రాజీవ్ టాండాన్ మాట్లాడుతూ... అమీర్ ఖాన్ను ఎవరైనా చెంపదెబ్బ కొడితే వారికి రూ.లక్ష నజరానా ఇస్తామని ప్రకటించారు. ఆయనను కొట్టే ప్రతి చెంప దెబ్బకు రూ.లక్ష ఇస్తామని ఆయన ప్రకటించారు.
ప్రస్తుతం అమీర్ ఖాన్ ఓ సినిమా షూటింగ్ ప్రచారం నిమిత్తం లుథియానాలో ఉన్నాడు. ఆయన ఉన్న ఎంబీడీ రాడిసన్ బ్లూ హోటల్ ముందు శివసేన నిరసన తెలిపింది. ఈ సందర్భంగా రాజీవ్ టాండన్ మాట్లాడారు. అమీర్ ఖాన్ వద్ద పని చేసే మేనేజర్, హోటల్ ఉద్యోగులు, సినిమా సిబ్బంది ఇలా ఎవరు రూ.లక్ష ఇస్తామన్నారు.
కాగా, అసహనంపై అమీర్ ఖాన్ విపరీత స్పందన దేశ ప్రతిష్ఠనే కాకుండా ఆయన ప్రతిష్ఠనూ దిగజార్చేదిగా ఉందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్న విషయం తెలిసిందే. సహనమనేది దేశ వారసత్వంలోనే ఉందన్నారు.
సహనమనేది దేశ డీఎన్ఏలోనే ఉందని మరో కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. కృత్రిమమైన రాజకీయ ప్రచారంతో ప్రభావితం కావద్దని అమీర్ ఖాన్కు ఆయన ట్విటర్లో సూచించారు. అమీర్ ఖాన్ వ్యాఖ్యలు సహజంగానే అనేకమంది భావాలను గాయపర్చారన్నారు.