పాక్పై వ్యాఖ్యలు: నసీరుద్దీన్ షాపై ధ్వజమెత్తిన శివసేన
ముంబై: భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు బాగుండకపోవడంపై బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. పాకిస్థాన్ భూభాగం నుంచి నడిపిన ఉగ్రవాద కార్యకలాపాల బాధితుల నుంచి నసీరుద్దీన్ షా అడగాలని వ్యాఖ్యానించింది. సామ్నా సంపాదకీయంలో నసీరుద్దీన్ షా వ్యాఖ్యలపై విమర్శలు చేసింది.
ఇరు దేశాల మధ్య శుత్రపూరిత సంబంధాలపై బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా విచారం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ తమ శుత్రవు అనే విధంగా భారతీయులకు బ్రెయిన్ వాష్ చేశారని ఆయన అన్నారు. ఇరు దేశాలకు చెందిన ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలు ముఖ్యం కాబట్టి తాను తరుచుగా పాకిస్థాన్ సందర్శిస్తానని ఆయన చెప్పారు.
‘పాకిస్థాన్పై అంత ద్వేషం ఎందుకంటే.. పాక్ జరిపిన 26/11 దాడిలో బంధువులు, మిత్రులు, కుటుంబసభ్యులను కోల్పోయిన వారిని అడిగితే తెలుస్తుంది. పాకిస్థాన్ ఇప్పుడూ కూడా తన రక్త దాహాన్ని తీర్చుకుంటూనేవుంది. 26/11 దాడే కాదు, ఢిల్లీలో పార్లమెంటుపై దాడి, అంతకుముందు పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదులు జరిపిన దాడులు కూడా' అని శివసేన తన అధికారిక పత్రిక ‘సామ్నా' ఎడిటోరియల్లో పేర్కొంది.
ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి వచ్చిన షా లాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపింది. ‘కొద్ది రోజుల క్రితం జమ్మూకాశ్మీర్లోని కథ్వా పోలీస్ చెక్ పోస్టుపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసి ఓ భారతీయ జవానును కాల్చి చంపారు. ఆ జవాను తల్లిదండ్రులను అడగండి.. పాకిస్థాన్ను ఎందుకు ద్వేషిస్తున్నారని?' శివసేన ప్రశ్నించింది.
‘పాకిస్థాన్ రాయబారి అబ్దుల్ బాసిత్ జమ్మాకాశ్మీర్లోని వేర్పాటువాదులను పిలిపించుకుని పాకిస్థాన్ డే వేడుకలను భారత రాజధాని ఢిల్లీలో జరుపుకున్నారు. ఈ ఘటనతో వారి ఉద్దేశమేంటో తెలియడం లేదా?' అని ప్రశ్నించింది. ‘ఇప్పటి దాకా జరిగిందంతా మర్చిపోదాం. ఇక భవిష్యత్లోనైనా పాకిస్థాన్ మన దేశంతో సఖ్యతగా ఉంటుందా?' అని పేర్కొంది.
‘నసీరుద్దీన్ షా ఎన్నో ఏళ్లు కష్టపడి తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతలు కోల్పోతారా? లాహోర్లోని ఎవరైనా ఆయనకు చేతబడి చేశారా? అతడు(నసీరుద్దీన్ షా) ఇలా ఉండకూడదు' అని శివసేన పేర్కొంది.