షాకింగ్: జియో 4జీ ఫీచర్ ఫోన్ లో ‘వాట్సప్’ పనిచేయదా?
రిలయన్స్ జియో నుంచి వచ్చే నెలలోనే ‘జియో 4జీ ఫీచర్ ఫోన్’ మార్కెట్ లోకి విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోన్ లో వాట్సప్ యాప్ పనిచేస్తుందా? చేయదా?
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో నుంచి వచ్చే నెలలోనే 'జియో 4జీ ఫీచర్ ఫోన్' మార్కెట్ లోకి విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోన్ లో వాట్సప్ యాప్ పనిచేస్తుందా? చేయదా? ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ చర్చే జరుగుతోంది.
ఎందుకంటే, యూట్యూబ్ కు సంబంధించిన ఒక సాంకేతిక నిపుణుడు జియో ఫోన్ గురించి ఒక షాకింగ్ వార్త చెప్పినట్లుగా ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ ఒక కథనం కూడా ప్రచురించింది. వచ్చే నెల నుంచి జియో ఫోన్ బుకింగ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వార్త ఆ ఫోన్ కొనాలనుకునే వారిని అయోమయంలో పడేసింది.
గత శుక్రవారం ఈ ఫోన్ ఆవిష్కరణ సమయంలో కూడా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మాట్లాడుతూ ఈ ఫోన్లో జియో యాప్స్ ప్రీలోడెడ్గా వస్తాయని, వీడియో కాలింగ్ చేసుకోవచ్చని, సినిమాలు చూసుకోవచ్చని, ఫేస్బుక్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియాను ఉపయోగించుకోవచ్చని తెలిపారుగానీ వాట్సప్ యాప్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు.
దీనిని బట్టి చూస్తే.. ఈ ఫోన్ పాపులర్ యాప్ 'వాట్సాప్'కు సపోర్ట్ చేయదని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో 20 కోట్ల మంది వాట్సాప్ యూజర్లు ఉండగా.. మరి ఈ ఫోన్ కొనాలనుకునే వారికి ఇది చేదు వార్తే.
అయితే ఫోన్ విడుదలైన తరువాత ఇందులో 'వాట్సాప్'ను జియో అప్డేట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు, ఈ జియో ఫోన్ లో వాట్సాప్కు పోటీగా 'జియో చాట్'ను తెచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
దేశంలో 78 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉండగా వారిలో 50 కోట్ల మంది ఫీచర్ ఫోన్లే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు జియో 4జీ ఫీచర్ ఫోన్ ద్వారా వారందరినీ జియో వైపు ఆకర్షించాలన్నది ముకేశ్ లక్ష్యమని నిపుణులు చెబుతున్నారు. అంతాబాగానే ఉంది కానీ, మరి వాట్సప్ ప్రియుల సంగతేమిటి? ఇప్పటికే వాట్సప్ ఉపయోగానికి బాగా అలవాటు పడిన స్మార్ట్ ఫోన్ ప్రియులు ఈ జియో ఫోన్ ను కొంటారా?