కోర్టు ఆవరణంలో ఏకే-47తో కాల్పులు, ముగ్గురి మృతి
జార్ఖండ్: పాత కక్షల కారణంగా కోర్టు ఆవరణంలో తుపాకితో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన జార్ఖండ్ లో జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలోని హోజారిబాగ్ కోర్టు ఆవరణంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో హోజారిబాగ్ కోర్టు ఆవరణంలోకి గ్యాంగ్ స్టర్ సుశీల్ శ్రీవాస్తవ తన అనుచరుడితో కలిసి వెళ్లాడు. అనంతరం బ్యాగ్ లో ఉన్న ఏకే-47 గన్ తీసుకుని ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపాడు. 30 రౌండ్ లకు పైగా బుల్లెల్ లు దూసుకు వెళ్లాయి.
ఈ కాల్పులలో ముగ్గురు సంఘటనా స్థలంలో మరణించారు. ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఒక్కసారిగా కాల్పుల కలకలంతో కోర్టు ఆవరణంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కాల్పులు జరిపిన సుశీల్ శ్రీవాస్తవ తన అనుచరుడితో కలిసి అక్కడి నుండి తప్పించుకున్నాడు.
సుశీల్ శ్రీవాస్తవ హత్య కేసులో అరెస్టు అయి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే జైలు నుండి బయటకు వచ్చాడని పోలీసు అధికారులు చెప్పారు. అంతేకాకుండా మాఫియా ముఠా సభ్యుడి హత్య కేసులో శ్రీవాస్తవ ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు.