వేచి చూడండి: జయలలిత కేసుపై సిద్దరామయ్య వ్యాఖ్య
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమ ఆస్తుల కేసు విషయంలో సుప్రీం కోర్టులో అప్పీలు చేసే విషయంలో న్యాయ నిపుణలుతో చర్చిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
కర్ణాటక హై కోర్టు ఏక సభ్య బెంచ్ జయలలితకు క్లీన్ చిట్ ఇచ్చిన తీర్పును న్యాయశాఖ అధికారులకు పంపించామని సిద్దరామయ్య అన్నారు. తీర్పులోని పూర్తి వివరాలను అధ్యయనం చేసి వారు తమకు నివేదిక పంపిస్తారని చెప్పారు.
నివేదిక పరిశీలించిన తరువాత కర్ణాటక ప్రభుత్వం జయలలిత అక్రమ ఆస్తుల కేసు సుప్రీం కోర్టులో అప్పీలు చెయ్యాలా, వద్దా అని తుదినిర్ణయం తీసుకుంటామని సిద్దరామయ్య వివరించారు. జయలలిత సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు సిద్దరామయ్య ఢిల్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం కే.ఎస్. ఈశ్వరప్ప (బీజేపీ) మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ జయలలిత కేసు విషయంలో సుప్రీంలో అప్పీలు చెయ్యాలని కాంగ్రెస్ ను డిమాండ్ చేశారు. జయలలిత అక్రమాస్తుల కేసు చిన్నది కాదని, అవినీతిని ప్రోత్సహించరాదని కాంగ్రెస్ పార్టీ బావిస్తే వెంటనే సుప్రీం కోర్టులో అప్పీలు చెయ్యాలని డిమాండ్ చేశారు.