'షీనా నాకు తెలియదే', 'ఇంద్రాణిని ప్రేమించా, పెళ్లిలేదు'
ముంబై: షీనా బోరా హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. షీనా తల్లి ఇంద్రాణి మొదటి భర్త సిద్ధార్థ్ దాస్.. భార్య ఆసక్తికర విషయం వెల్లడించింది. షీనా హత్య విషయం వెలుగులోకి వచ్చే వరకు తనకు తన భర్త సిద్ధార్థ్ దాస్ గత జీవితంలో ఇవి ఉన్న విషయం తనకు తెలియదని చెప్పారు.
తనకు ఇంద్రాణి, ఆమె కూతురు షీనా బోరా గురించి తెలియదని ఆమె చెప్పారు. తన భర్త జీవితంలో వీరు ఇద్దరు ఉన్నట్లు తెలియదన్నారు. అయితే, తన భర్త గతం గురించి తనకు అనవసరమని, గతం గురించి ఆయన చెప్పకపోయినప్పటికీ తాను తన భర్తను వదిలి పెట్టేది లేదని చెప్పారు.
తన కొడుకుకు పరీక్షలు ఉన్నాయని, మరిన్ని కారణాలతో ఇలాంటి సెన్సిటివ్ విషయాల పైన తాను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదన్నారు.
కాగా, అంతకుముందు సిద్ధార్థ్ మాట్లాడుతూ... 1989 నుంచి తనకు ఇంద్రాణితో ఎలాంటి కాంటాక్ట్ లేదని చెప్పారు. ప్రస్తుతం తాను తన భార్య, కొడుకుతో సంతోషంగా ఉన్నానని చెప్పారు. షీనా హత్య బాధించిందని, తాను పోలీసులకు దర్యాఫ్తులో సహకరిస్తానని చెప్పారు.
నేను ఇంద్రాణిని పెళ్లే చేసుకోలేదు: సిద్ధార్థ్ దాస్
ఇంద్రాణి మొదటి భర్తగా సిద్ధార్థ్ దాస్ను చెబుతోన్న విషయం తెలిసిందే. అతనే షీనా బోరా తండ్రి అని భావిస్తున్నారు. సిద్ధార్థ్ దాస్ మరో షాకింగ్ విషయం చెప్పాడు. ప్రస్తుతం సిద్దార్థ్ దాస్ కోల్ కతాలో ఉన్నారు. ఆయన మాట్లాడుతూ.. తాను అసలు ఇంద్రాణీని పెళ్లే చేసుకోలేదని చెప్పాడు.
తాను గౌహతిలో తొలుత ఇంద్రాణిని కలిశానని చెప్పారు. ఆ సమయంలో ప్రేమలో పడ్డానని చెప్పారు. తాను, ఇంద్రాణితో కలిసి వారి గౌహతిలోని వారి పేరెంట్స్ వద్ద ఉన్నామని చెప్పాడు. ఇద్దరు జన్మించారన్నాడు. షీనా బోరా 1987లో పుట్టిందని, మిఖాయిల్ బోరా 1988లో పుట్టాడని దాస్ చెప్పాడని తెలుస్తోంది.
ఆ తర్వాత కొద్ది రోజులకు ఇంద్రాణి వెళ్లిపోయిందని, షిల్లాంగులో పని ఉందని చెప్పి వెళ్లిందని చెప్పాడు. ఆ తర్వాత ఆమె తిరిగి రాలేదన్నాడు. తాను ఇంద్రాణి గురించి వెతికానని, కానీ ఎక్కడా దొరకలేదన్నాడు. ఆ తర్వాత తనను గౌహతిలోని ఇంద్రాణి తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వలేదని చెప్పాడు.
ఇంద్రాణికి డబ్బు పిచ్చి అని, అందుకే తనను వదిలి పెట్టిందని సిద్దార్థ్ దాస్ చెప్పాడని తెలుస్తోంది. షీనా పదో తరగతిలో ఉండగా తాను ఫోన్లో మాట్లాడనని, మిఖాయిల్తో కనీసం ఫోన్లో మాట్లాడలేదన్నాడు. పిల్లలతో కలవాలన్నా, మాట్లాడాలన్నా వాళ్ల అమ్మమ్మ తాతయ్యలు ఒప్పుకోలేదన్నాడు.
షీనా హత్యకు గురైందనే విషయం తనకు తెలియదన్నాడు. మీడియా ద్వారానే తెలిసిందన్నాడు. ఇంద్రాణి పీటర్ ముఖర్జియాను పెళ్లి చేసుకున్న విషయం తెలియదన్నాడు. షీనాను తల్లి ఇంద్రాణియే చంపి ఉండొచ్చన్నాడు. చాలాకాలం కనిపించకుండా పోయిని సిద్ధార్థ్ దాస్ ఓ మీడియా సంస్థ ద్వారా మాట్లాడాడు.
చేయనిదానిని అంగీకరించను: ఇంద్రాణి
ఇంద్రాణి పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆమె తరఫు న్యాయవాది చెప్పిన విషయం తెలిసిందే. కాగా, తాను చేయని దానిని అంగీకరించేందుకు సిద్ధంగా లేనని ఇంద్రాణి చెప్పినట్లుగా తెలుస్తోంది.
లాయరుతో మాట్లాడేందుకు ఇంద్రాణికి 30 నిమిషాలు సమయం ఇచ్చారు. ఐదుగురు ముంబై పోలీసుల సమక్షంలో కలిసే అవకాశమిచ్చారు. ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులు, ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక లేడీ ఆఫీసర్ సమక్షంలో కలిశారు.
పోలీసులు విష ప్రయోగం చేస్తారేమోనని ఇంద్రాణి లాయర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు అనుమతివ్వాలని కోరారు. అయితే, ఇంద్రాణికి పోలీసులు ఇంటి భోజనం అనుమతించలేదు. అయితే, ఇంటి నుంచి పండ్లు తెచ్చుకునేందుకు అంగీకరించారు.
ఇంద్రాణి కుటుంబం ఆమె వెంటే ఉందని ఆమె తరఫు లాయర్ చెప్పారు. షీనాను హత్య చేసినట్లు అంగీకరించాలని పోలీసులు ఇంద్రాణీ పైన చేయి చేసుకుంటున్నారని, బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.