రంగంలోకి మూర్తి: ఇన్వెస్టర్లతో సమావేశం,కొత్త సిఈఓ ఎవరు?
బెంగుళూరు: ఇన్పోసిస్లో ముదురుతున్న వివాదంపై ఇన్పోసిస్ వ్యవస్థాపక సభ్యుడైన నారాయణమూర్తి రంగంలోకి దిగారు. ఇన్పోసిస్ను దారిలోపెట్టేందుకు చర్యలు తీసుకొనే ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ నెల 23వ,తేదిన సాయంత్రం ఇన్వెస్టర్లతో నారాయణమూర్తి సమావేశం కానున్నారు.
ఇన్పోసిస్ నుండి నారాయణమూర్తి వెదొలగాల్సిందే: ఓంకార్
ఇన్పోసిస్లో ఇటీవల చోటుచేసుకొన్న ఘటనలు వివాదానికి కారణమయ్యాయి.తాజాగా ఇన్పోసిస్ సిఈఓ విశాల్ సిక్కా రాజీనామా చేశారు. సిక్కా రాజీనామాకు ఇన్పోసిస్లో చోటుచేసుకొన్న సంఘటనలే కారణమనే ఆరోపణలు కూడ ఉన్నాయి.
అయితే ఇన్పోసిస్ సిఈఓ పదవికి సిక్కా రాజీనామా చేయడానికి ఇన్పోసిస్ వ్యవస్థాపక సభ్యుడైన నారాయణమూర్తి కారణమంటూ మాజీ బోర్డు సభ్యుడు ఓంకార్ రాసిన లేఖ కలకలానికి కారణమైంది.
ఇన్పోసిస్లో కొంతకాలంగా వ్యవస్థాపక సభ్యులకు , బోర్డు సభ్యులకు వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ విషయమై బహిరంగంగానే ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకొంటున్నారు. ఈ పరిణామాలే విశాల్ సిక్కా రాజీనామాకు దారితీశాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
ఇన్వెస్టర్లతో సమావేశం కానున్న నారాయణమూర్తి
ఇన్పోసిస్లో ముదురుతున్న వివాదంపై ఇన్పోసిస్ పౌండర్ నారాయణమూర్తి రంగంలోకి దిగారు. ఈ నెల 23వ, తేదిన సాయంత్రం ఇన్వెస్టర్లతో సమావేశం కానున్నారు. ఇన్పోసిస్ను గాడిలో పెట్టేందుకు నారాయణమూర్తి చర్యలను తీసుకోనున్నారని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఇన్పోసిస్ను సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు ప్రయత్నాలను చేసే అవకాశాలున్నాయి.
కేంద్ర మంత్రి అరుణ్జైట్లీతో ఇన్పోసిస్ కో ఛైర్మెన్ భేటీ
ఇన్పోసిస్లో చోటుచేసుకొన్న తాజా పరిణామాలపై ఇన్పోసిస్ కో చైర్మెన్ రవి వెంకటేశన్ మంగళవారం నాడు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీని కలిశారు. ఇన్పోసిస్ సీఈఓ విశాల్ సిక్కా రాజీనామా నేపథ్యంలో అరుణ్ జైట్లీకి కంపెనీలో నెలకొన్న పరిణామాలను రవి వెంకటేశన్ సమాచారాన్ని ఇచ్చారని సమాచారం.
షేర్ హౌల్డర్స్ రక్షణకు చర్యలు
షేర్ హోల్డర్స్ ను రక్షించేందుకు జరుగుతున్న చర్యలపై ఇన్పోసిస్ తీసుకొంటున్న చర్యలపై కేంద్ర మంత్రి అరుణ్జైట్లీకి వివరించినట్టు సమాచారం. ఈ పరిణామాలతో ఇన్పోసిస్లో నాలుగురోజుల పాటు చోటుచేసుకొన్న పరిణామాలపై ఏదో జరుగుతోందనే ఉత్కంఠ నెలకొంది.దీంతో ఇన్పోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి నడుంబిగించారు.
కొత్త సిఈఓ ఎవరు?
విశాల్ సిక్కా రాజీనామా తర్వాత కొత్త సిఈఓను ఎంపిక చేసే కసరత్తు ఇంకా కొలిక్కి రావడం లేదు. దీంతో ఈ వ్యవహరాన్ని చక్కదిద్దేందుకు పీస్ మేకర్గా మరో కో పౌండర్ నందన్ నీలేకనీ రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు బోర్డు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తొంది. పౌండర్ గ్రూప్కు, బోర్డుకు మద్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉందని సమాచారం. సెబీ కూడ రంగంలోకి దిగిందని తెలుస్తోంది.
వాటాదారుల ప్రయోజనాన్ని కాపాడే చర్యలు
చిన్న వాటాదారుల ప్రయోజనాలను,సంపదను కాపాడేందుకు సెబీ కూడ రంగం సిద్దం చేస్తోంది. సిక్కా రాజీనామా, బై బ్యాక్, అమెరికా సంస్థల ఆరోపణలు, ఇన్వెస్టర్ల వేల కోట్ల సంపద తదితర అంశాలను నిశితంగా పరిశీలిస్తోంది. సంస్థలో ప్రధానవాటాదారుగా ఉన్న ఎల్ఐసి ఈ పరిణామాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. విశాల్ సిక్కా రాజీనామా చేసిన రోజునే రూ.22,518 కోట్లను ఇన్పోసిస్ నష్టపోయింది. టాప్ 10 కంపెనీల జాబితాలో ఇన్పోసిస్ చోటును కోల్పోయింది.యూబీ ప్రవీణ్రావును మధ్యంతర సిఈఓగా నియమించినా ప్రయోజనం లేకపోయింది.