చిన్న గొడవ కాదు: చైనా, భారత్ ఊహించని షాక్.. అందుకే అలా బెదిరింపు
బీజింగ్/న్యూఢిల్లీ: సిక్కిం సరిహద్దు సంక్షోభాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి చైనా సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. గతంలో కూడా చైనాతో సరిహద్దు సమస్యలు ఏర్పడ్డాయని, వాటిని పరస్పర చర్చలతో పరిష్కరించుకుంటామని భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
దీనిపై చైనా విదేశాంగ ప్రతినిధి గెంగ్ షువాంగ్ తీవ్రంగా స్పందించారు. సిక్కిం వ్యవహారం ఎల్ఏసి వెంబడి జరిగిన చిన్న చిన్న గొడవ లాంటిది కాదని బుధవారం వ్యాఖ్యానించారు.
దక్షిణ భారత్ నుంచి చైనా మొత్తాన్ని టార్గెట్ చేసేలా..!: ఇదీ ఇండియా 'లక్ష్యం'
తూర్పు, మధ్య, పశ్చిమ సరిహద్దులను భారత బలగాలు చాలాసార్లు అతిక్రమించాయని, అయితే ఇవి గుర్తించని సరిహద్దులు అని, డొక్లాం పూర్తిగా గుర్తించిన ప్రాంతమని చెప్పారు. 1890లోనే చైనా, భారత్ ఓ అవగాహనకు వచ్చాయన్నారు.
చైనా ఎత్తుగడ
కాగా, డోక్లామ్ ప్రాంతంలో భారత్తో సైనిక ప్రతిష్టంభనకు దిగడం వెనుక చైనా మనస్సులో దుర్బుద్ధి ఉందని అమెరికా నిపుణులు చెప్పిన విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖకు సంబంధించిన యథాతథ స్థితిలో అంగుళం, అంగుళం చొప్పున మార్పులు చేయాలన్న తన సలామీ స్లైసింగ్ ఎత్తుగడల్లో భాగంగానే చైనా ఈ చర్యకు పాల్పడిందని విశ్లేషిస్తున్నారు.
వ్యూహంలో భాగమే
సిక్కిం ప్రాంతంలో భారత్, భూటాన్, చైనాల కూడలిలోని డోక్లామ్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి చైనా సైన్యం చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం అడ్డుకోవడంతో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై భారత్లో అనేక మంది తరహాలో తానూ ఆందోళన చెందుతున్నానని, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ప్రదర్శించిన రీతిలో ఇది కూడా చైనా వ్యూహంలో భాగమేనని ఒబామా ప్రభుత్వంలో విదేశాంగ శాఖ అధికారిగా వ్యవహరించిన అలీసా ఏరెస్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అంగుళం అంగుళం చొప్పున కబళిస్తూ.. వ్యూహాత్మక ప్రయోజనాన్ని పొందాలన్నది చైనా ఎత్తుగడ అని చెప్పిన విషయం తెలిసిందే.
బలహీనులుగా చూడొద్దనే
దక్షిణ చైనా సముద్రంలోనూ యథాతథ స్థితిలో ఇదే రీతిలో స్వల్ప మార్పులు చేసుకుంటూ పోయి అంతిమంగా వ్యూహాత్మక లబ్ధిని పొందిందని ఆమె పేర్కొన్నారు. ఈ సరిహద్దు వివాదానికి భారత్, చైనాలు అహింసా పద్ధతిలో పరిష్కార మార్గాన్ని కనుగొంటాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్ డేనియల్ మార్కే తెలిపారు. తమను బలహీనులుగా ఎవరూ పరిగణించరాదన్నది భారత్, చైనా ఉద్దేశంగా కనపడుతోందన్నారు. అందువల్ల సరిహద్దు, ఇతర వివాదాలు తరచూ తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. భవిష్యత్తులో వీటిని చల్లార్చడం కష్టమన్నారు.
భవిష్యత్తులో యుద్ధం జరిగే అవకాశమంటూ అప్పుడే
భవిష్యత్లో భారత్, చైనాల మధ్య యుద్ధం జరిగే అవకాశముందని 2015లో వెలువరించిన ఒక పత్రంలో మార్కే పేర్కొన్నారు. దాన్ని నివారించాల్సిన బాధ్యత అమెరికాకు ఉందన్నారు. ఒకవేళ చైనాకు మద్దతు పలకడం కాని, తటస్థంగా ఉండటంకానీ చేస్తే భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు.
చైనా బెదిరింపులకు లొంగబోదు
మరోవైపు, భారత్-చైనా మధ్య సైనిక ప్రతిష్టంభన శీతాకాలం వరకూ కొనసాగే అవకాశముందని అంటున్నారు. ప్రస్తుతం తాను మోహరించిన ప్రదేశం నుంచి వెనక్కి వచ్చేందుకు భారత్ సిద్ధంగా లేదు. భారత్ చాలా అనుకూల స్థితిలో ఉందని, చైనా బెదిరింపులకు లొంగబోదని పరిశీలకులు చెబుతున్నారు.
చైనా ఊహించలేదు.. దీంతో అధికార మీడియాతో..
జూన్ 1న భూటాన్లోకి వచ్చి, రోడ్డు నిర్మాణానికి పూనుకున్నప్పుడు భారత్ దానిని వ్యతిరేకిస్తుందని చైనా అనుకోలేదని పరిశీలకులు చెబుతున్నారు. భూటాన్పై దాడి చేస్తే భారత్పై దాడి చేసినట్లేనని 1958లో అప్పటి ప్రధాని నెహ్రూ పార్లమెంటులో ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. భూటాన్ను బెదిరించి, ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలని చైనా చూసిందని, భారత్ ధీటుగా స్పందించడంతో అధికార మీడియాను అడ్డు పెట్టి బెదిరింపులకు పాల్పడుతోందంటున్నారు.
అమెరికా వ్యూహాత్మకంగా..
భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలపై స్పందించేందుకు అమెరికా నిరాకరించింది. ఆ వార్తలు చూశామని, దుపరి సమాచారం కోసం వాటిని భారత్, చైనా ప్రభుత్వాలకు పంపామని వైట్హౌస్లోని జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి తెలిపారు.