కబళించిన విధి: మరికొద్దిసేపట్లో పెళ్లి.. ఇంతలోనే మృత్యువు ఒడిలోకి వధువు!
వధువు దివ్య చనిపోయిన విషయాన్ని వరుడు హరీశ్ కు తెలియనివ్వలేదు. దివ్య మరణం గురించి తెలిస్తే అతను తట్టుకోలేడని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.
బెంగుళూరు: తమ ప్రేమను ఇంట్లోవాళ్లు ఒప్పుకున్నారన్న ఆనందం.. మరికొద్ది సేపట్లో ఇద్దరం ఒక్కటవబోతున్నామన్న ఉత్సాహం.. వారికి ఎంతోసేపు నిలవలేదు. అంతా కలిసి ఆనందోత్సాహాల నడుమ పెళ్లి మంటపానికి బయలుదేరిన సమయంలో.. ఓ యాక్సిడెంట్ వారిని కబళించింది. దీంతో పెళ్లి కళతో సందడిగా ఉండాల్సిన ఆ రెండు కుటుంబాల్లో ప్రస్తుతం తీవ్ర విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరుకు చెందిన దివ్య(20), హరీశ్ లు ఇద్దరు చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్దమయ్యారు. ఈ మేరకు గురువారం ఉదయం ధర్మస్థలంలో వీరి పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకోసం వధూవరులు సహా ఇరు వర్గాల బంధుమిత్రులు ఒక టెంపోలో బయలుదేరారు.
అయితే మార్గమధ్యలోనే వీరు ప్రయాణిస్తున్న టెంపో వ్యాన్ ను ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో వధువుతో సహా 8మంది అక్కడిక్కడే చనిపోయారు. మృతులను వధువు దివ్య కుడేర్కర్(20), డ్రైవర్ నాగప్ప గణిగార్(45), టెంపోలో ఉన్న పాలాక్షి(42), బేబి(38), సుబ్రహ్మణ్య(15), రుక్మిణి(65)గా గుర్తించారు. ఇక పూజా సేఠ్ అనే మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలాడు.
వధువు దివ్య చనిపోయిన విషయాన్ని వరుడు హరీశ్ కు తెలియనివ్వలేదు. దివ్య మరణం గురించి తెలిస్తే అతను తట్టుకోలేడని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. కాగా, టెంపోను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు డ్రైవర్ వాల్మీకి కూడా అక్కడిక్కడే మరణించాడు.క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.