కారులోని మహిళలపై దాడికి యత్నం: ఆరుగురి అరెస్టు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో కారులో కూర్చున్న మహిళలపై దాడికి యత్నించిన సంఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ముగ్గురు బెంగళూరుకు చెందినవారు కాగా, మరో మగ్గురు తమిళనాడు రాష్ట్రంలోని హోసూరుకు చెందినవారు. బెంగళూరు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి మగంళవారం ఈ విషయం చెప్పారు.
వాళ్లు మామూలుగానే ఎంజి రోడ్డుకు వచ్చారని, అయితే కారులో మహిళలను చూసి దగ్గరగా వెళ్లి కారు తలుపులు బలవంతంగా తీయడానికి కూడా ప్రయత్నించారని, దాంతో మహిళలు భీతిల్లారని ఆయన చెప్పారు. తాము ఆ సంఘటనకు పాల్పడినట్లు వారు అంగీకరించారని, అయితే వారి నేపథ్యాన్ని చూసి వారికి నేరచరిత్ర ఉందా అనే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు.
ఫిర్యాదుదారులు ఇచ్చిన సాక్ష్యాల మేరకు నిందితులను గుర్తించామని, వారు కూడా నేరాన్ని అంగీకరించారని, పోలీసులకు తగిన సాక్ష్యాలు లభించాయని ఆయన అన్నారు. కేసు నమోదైన 48 గంటల్లో తమ పోలీసులు నిందితులను అరెస్టు చేయడం ఆనందంగా ఉందని రెడ్డి చెప్పారు
కర్నాటక రాజధాని బెంగళూరు ఎంజీ రోడ్డులో ఐదుగురు మహిళ పైన ఆరుగురు వ్యక్తులు శనివారం రాత్రి పదకొండున్నర గంటలకు దాడికి యత్నించారు. సదరు మహిళలు కారులో ఉండగా వారు దాడికి యత్నించారు. అయితే, ఓ మహిళ వెంటనే తన ఫోన్ ద్వారా వారి ఫోటోలను క్లిక్మనిపించారు. అనంతరం రక్షించాలని అరవడం ప్రారంభించారు. వారు అరవడంతో ఐదుగురు కూడా అక్కడి నుండి పరారయ్యారు.
సదరు మహిళలు కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం... శనివారం రాత్రి ఓ 27 ఏళ్ల మహిళ తన నలుగురు మహిళా స్నేహితురాళ్లతో కలిసి ఐస్ క్రీం కోసం వెళ్లారు. వారు ఎంజీ రోడ్డులోని ఐస్ క్రీం పార్లర్కు తమ టయోటా ఇన్నోవాలో వెళ్లారు. డ్రైవర్ ఐస్ క్రీం తెచ్చేందుకు వెళ్లిన సమయంలో ముగ్గురు వ్యక్తులు కారు వద్దకు వచ్చి నిలబడ్డారు. వారు దాదాపు పదిహేను నిమిషాలు నిలబడ్డారు.
కాసేపటికి ఆ ముగ్గురుకి మరో ఇద్దరు కలిశారు. ఒకరు వారి కారు డోర్ తెరిచేందుకు ప్రయత్నించారు. అంతలో సదరు మహిళ స్నేహితురాలు అప్రమత్తమై డోర్ లాక్ చేశారు. అనంతరం వారు జేబులో నుండి ఏవో తీసి కారు డోర్ తెరిచే ప్రయత్నాలు చేశారు. దీంతో వారు భయపడి కేకలు వేయడం ప్రారంభించారు. అదే సమయంలో మహిళలు వ్యక్తుల ఫోటోలను క్లిక్ మనిపించారు. వీడియో తీశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.