పాకిస్తాన్లో ముద్రించిన నకిలీ నోట్లు: రూ.9.13 లక్షలు సీజ్
బెంగళూరు: పాకిస్థాన్ లో ముద్రించిన నకిలీ నోట్లు చలామణి చేసేందుకు ప్రయత్నించిన అంతర్జాతీయ ముఠా సభ్యులను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన షబ్బీర్ ఆలీ, మసూద్, గౌరిబిదనూరు నివాసి అఫ్రోజ్, మైసూరు నివాసి ఆఫీస్ వుల్లాఖాన్, మహీద్ వుల్లాఖాన్, సయ్యద్ హఫీజ్లను అరెస్టు చేశారు.
ఈ ముఠా నుండి రూ.9.13 లక్షల నకిలీ నోట్లు, రూ.1.72 లక్షలు (అసలైన నోట్లు), టాటా ఇండికా కారు, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం ఎన్ రెడ్డి మంగళవారం తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
నిందితులు సోమవారం రాత్రి బెంగళూరులోని కేఆర్ పురం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఎ నారాయణ పుర దగ్గర టాటా ఇండి కారులో నకిలి నోట్లు పెట్టుకుని చలామణి చేసేందుకు ప్రయత్నించారు. కచ్చితమైన వివరాలు తెలుసుకున్న సీసీబీ పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేశారని ఎంఎన్ రెడ్డి తెలిపారు.
స్వాధీనం చేసుకున్న నకిలి నోట్లు పాకిస్థాన్ లో ముద్రించారన్నారు. పాకిస్థాన్ నుండి బంగ్లాదేశ్ మీదుగా ఈ నకిలి నోట్లు భారత్ లోకి తీసుకు వచ్చినట్లు నిందితులు విచారణలో అంగీకరించారని ఎంఎన్ రెడ్డి చెప్పారు. రూ.2 లక్షలు అసలైన నోట్లు ఇస్తే రూ.నాలుగు లక్షల నకిలీ నోట్లు వీరు ఇస్తున్నారని వివరించారు. ఈ ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయమై ఆరా తీస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బెంగళూరు నగర జాయింట్ పోలీసు కమిషనర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.