ఆరుసార్లు హత్యాయత్నం జరిగింది: సైరాబానో
ఆరుసార్లు నాపై హత్యాయత్నం జరిగిందని ట్రిపుల్ తలాక్పై పోరాటం నిర్వహించిన బానో చెప్పారు.అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు.
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్పై సుదీర్ఘ పోరాటం నిర్వహించిన షయారో బానోపై ఆరు దఫాలు హత్యాయత్నం జరిగింది. అయినా ఆమె చెక్కు చెదరని ధైర్యంతో పోరాటం నిర్వహించింది.ఆమెకు తోడుగా ఆమె సోదరుడు అర్షద్అలీ నిలిచాడు. ఎట్టకేలకు ఈ కేసులో ఆమెకు విజయం లభించింది.
ట్రిపుల్ తలాక్పై షయారో బానో న్యాయం కోసం సుదీర్ఘమైన పోరాటం చేసింది. ఉత్తరాఖండ్లోని కాశీపూర్కు చెందిన బానోను ఆమె కుటుంబసభ్యులు రిజ్వాన్ అహ్మద్కు ఇచ్చి వివాహం చేశారు. 2015లో ఆమె భర్త స్పీడ్ పోస్టులో ట్రిపుల్ తలాక్ చెప్పాడు. బానో శోకసాగరంలో మునిగిపోయింది. ఎలాంటి సహేతుక కారణం లేకుండానే తనకు విడాకులు ఇవ్వడంపై న్యాయస్థానంలో కేసు వేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆమె సోదరుడు అర్షద్ అలీ అండగా నిలిచారు.
2002లో బానో వివాహం జరిగింది. పెళ్ళైన కొద్ది కాలానికే అత్తింట్లో బానోకు వేధింపులు ప్రారంభమయ్యాయి. అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటివారు బానోను వేధింపులకు గురిచేశారు. ఇద్దరు పిల్లలకు ఆమె జన్మనిచ్చింది. అనంతరం ఏకంగా ఆరు గర్భస్రావాలు చేయించారు. ఈ గర్భస్రావం సందర్భంగా తనకు ఏదైనా జరిగితే అడ్డు తొలగించుకోవచ్చన్న కుట్రతో ఆడపడుచులు యత్నించినట్టు ఆమె ఆరోపించారు.
ట్రిపుల్ తలాక్ ఇచ్చిన భర్తే ఇద్దరు కుమారులను కూడా బలవంతంగా తీసుకువెళ్లాడు. అయితే ఆమె తల్లిదండ్రులు, సోదరుడు ఇచ్చిన నైతిక మద్దతు ముందుకు నడిపించాయన్నారు బానో. న్యాయం కోసం ఎదురుచూసిన నాకు న్యాయం లభించింది. కనీసం నా కన్నబిడ్డలను కూడా కలిసేందుకు అవకాశమిచ్చేవారు కాదు.. ఇన్నాళ్లకు నా కష్టాలు తీరాయని బానో అభిప్రాయపడ్డారు.