ఒక్కరి వల్లే కాదు, చెప్పుతో బుద్ధి చెప్పండి: పవన్ కళ్యాణ్ ఆగ్రహం
శ్రీకాకుళం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్ విజయానికి అందరు కృషి చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పరిశుభ్రత ఒక్కరి వల్లనే సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ఆడపిల్లకు భద్రత ఉండే సమాజం కావాలన్నారు. ఆడపిల్లలు ధైర్యంగా బయటకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఎవరైనా తప్పు చేస్తే నిలదీయగలిగే సత్తా విద్యార్థుల్లో రావాలని చెప్పారు. ఆడపిల్లలను ఏడిపించే పోకిరీలకు చెప్పుదెబ్బలతో బుద్ధి చెప్పాలన్నారు. ఎవరైనా ఏడిపిస్తే చెప్పుతో బుద్ధి చెప్పాలన్నారు. సొంత ఊరిని, కన్నతల్లిని ఎవరూ మరువకూడదన్నారు.
పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా రాజాంలో పర్యటిస్తున్నారు. జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
పవన్ కళ్యాన్ రాజాంలో 25 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. సినిమాల్లో నీతి చెప్పడం చాలా తేలికని, ప్రతి ఒక్కరూ విద్యావంతులైతేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. అమ్మాయిలపై దాడులను యువత తిప్పి కొట్టాలన్నారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, సమాజసేవే ముఖ్యమన్నారు.
స్వచ్ఛ భారత్లో సల్మాన్ ఖాన్, మోడీ కితాబు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్లో నిమగ్నమయ్యారు. ప్రధాని తొలిసారి సల్మాన్ను నామినేట్ చేశారు. తనవంతుగా ఇప్పుడు సల్మాన్ వందలాదిమందిని నామినేట్ చేయనున్నారట.
ప్రధాని స్వచ్ఛ భారత్కు నామినేట్ అయ్యానని, ఈ క్రమంలో మహారాష్ట్రకు దగ్గరలోని మూడు గ్రామాల్లో కొన్ని ఇళ్ల వద్ద శుభ్రం చేసి, అక్కడి ఇళ్లకు రంగులు వేశానని, ఈ ప్రయత్నాన్ని నేను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో, స్వచ్ఛ భారత్ అంటే కేవలం ఒక్కరే చేయగలిగేది కాదని, ప్రతి ఒక్కరు చేయగలుగుతారనేది ఇక్కడ ప్రధానమని సల్మాన్ పేర్కొన్నారు.
అందుకే గణతంత్ర దినోత్సవం రోజున ఈ సామాజిక ప్రచారం గురించి మాట్లాడాలనుకుంటున్నానని, స్వచ్ఛ భారత్కు ప్రతి నేల 100 మందిని నామినేట్ చేస్తానని, దయచేసి మీ ఇళ్ల వద్ద, చుట్టుపక్కల ప్రాంతాల్లో సరైన విధంగా స్వచ్ఛ భారత్ ప్రారంభించాలని కోరారు. తొలి జాబితాను అప్ లోడ్ చేస్తానని చెప్పారు. కాగా, సల్మాన్ను మోడీ ప్రశంసించారు. మోడీ కంగ్రాట్స్ తెలిపారు.