బెంగళూరు మెట్రో రైలు సొరంగంలో పొగలు
బెంగళూరు: బెంగళూరు మెట్రో సొరంగ మార్గంలో పొగలు రావడంతో రైలు ప్రయాణికులు, సిబ్బంది హడలిపోయారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో విదాన సౌధ- కబ్బన్ పార్క్ మార్గంలో మెట్రో రైలు సొరంగ మార్గంలో పొగలు వచ్చాయి.
విషయం తెలుసుకున్న బీఎంఆర్ సీఎల్ అధికారులు పరుగు తీశారు. ఆ మార్గంలో మెట్రో రైలు సంచారాన్ని పూర్తిగా నిలిపివేశారు. పొగలు రావడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అధికారులు అంటున్నారు.
విదాన సౌధ సమీపంలోని మెట్రో రైలు సొరంగంలో పొగలు రావడంతో పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. పొగలు అదుపులోకి వచ్చిన తరువాత రైలు సంచారానికి అనుమతి ఇస్తామని అధికారులు చెప్పారు.
భూమి కుంగింది............!
ఆగస్టు 20వ తేదిన కెంపేగౌడ రోడ్డులోని మెట్రో సొరంగ మార్గం సమీపంలో భూమి కుంగిపోయింది. అడిగాస్ హొటల్ సమీపంలో భూమి 10 అడుగులు కుంగిపొయింది. తరువాత అధికారులు సిమెంట్ కాంక్రీట్ తో కుంగిపోయిన భూమిని పూడ్చివేశారు.