వీకెండ్స్లో మాత్రమే నటిస్తా: కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి అయిన తర్వాత ప్రముఖ సినీ నటి స్మృతీ ఇరానీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ బాగా బిజీ అయిపోయారు. దీంతో ఆమెకు మళ్లీ సినిమాల్లో నటించే సమయం దొరకడం లేదు. అయితే తాను వీకెండ్ రోజుల్లో మాత్రమే సినిమాల్లో నటించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. తాను పూర్తి చేయాల్సిన సినిమాల షూటింగ్స్లో వీకెండ్స్లోనే హాజరవుతానని వెల్లడించారు.
ప్రస్తుతం స్మృతీ ఇరానీ.. ఉమేష్ శుక్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం ‘ఆల్ ఈజ్ వెల్' నటిస్తున్నారు. ఆ చిత్రంలో అభిషేక్ బచ్చెన్ తల్లి పాత్రలో స్మృతీ ఇరానీ నటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందే స్మృతీ ఈ చిత్రంలో నటించేందుకు ఆమె ఒప్పుకున్నారు.
అయితే ఎన్నికలైన తర్వాత ఆమె కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం... అది అత్యంత ముఖ్యమైన శాఖలో ఒకటైనా మానవ వనరుల శాఖ కావడంతో స్మృతి నిత్యం బిజీబిజీగా గడుపుతున్నారు. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న హీరో నుంచి లైట్ బాయ్ వరకు చిత్ర యూనిట్ అంతా స్మృతి ఎలా అంటే అలా అని ప్రకటించేశారని సమాచారం. ఆల్ వెల్ చిత్రంలో స్మృతి ఇరానీ భర్తగా రిషి కపూర్ నటిస్తున్నారు.
కాగా, తాను 2014-15 మధ్యకాలంలో అంగీకరించిన సినిమాల షూటింగ్స్లో మాత్రమే ప్రస్తుతం నటిస్తున్నట్లు స్మృతీ ఇరానీ చెప్పారు. పార్లమెంటు సమావేశాలు లేని వీకెండ్ రోజుల్లేనే సినిమాల్లో నటించేందుకు ఆమె చిత్ర యూనిట్లకు తెలిపినట్లు తెలిసింది. ఈ చిత్రం షూటింగ్ హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, దుబాయ్, లండన్లో జరుగుతున్నట్లు తెలిసింది.