నరేంద్ర మోదీ బ్రహ్మ పిశాచి: లాలూ ప్రసాద్
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాని నరేంద్ర మోదీ మీద నిప్పులు చెరిగారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ స్థాయికి తగ్గట్టు మాట్లాడటం లేదని, తనను దెయ్యం అని అనటం సిగ్గు చేటు అని మండిపడ్డారు. తనను విమర్శించడంపై లాలూ తీవ్రంగా స్పందించారు. తాను దెయ్యం అయితే నరేంద్ర మోదీ బ్రహ్మ పిశాచి అంటూ ఎదురుదాడికి దిగారు.
తనను అవమానించడం వలన దేశంలోని యాదవులందరినీ కించపరిచారని ఆరోపించారు. ఇంత కాలం లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ప్రజల కోసం శక్తి వంచనలేకుండా పని చేశారని గుర్తు పెట్టుకోవాలని మోదీకి సూచించారు.
దళితులు, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చెయ్యాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రపన్నుతున్నాయని ఆరోపించారు. రిజర్వేషన్ల రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే తనను నరేంద్ర మోదీ విమర్శించారని మండిపడ్డారు.
బీహార్ ప్రజలు ఈ అసెంబ్లీ ఎన్నికలలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. నరేంద్ర మోదీకి భారత ప్రధాని అయ్యే ఏ ఒక్క అర్హత లేదని లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.