ఆ శోభనం జరిగుంటే.. ఎంత ఘోరమయ్యేదో..!
పశ్చిమగోదావరి : తాను నాశనమైందే గాక, అసలు విషయాన్ని కప్పి పుచ్చి ఓ నవ వధువు జీవితాన్ని నాశనం చేయిబోయిన పెళ్లి కొడుకు ఆట కట్టించారు పోలీసులు. తనకు ఎయిడ్స్ ఉందన్న విషయాన్ని దాచిపెట్టి, ఓ యువతిని వివాహాం చేసుకున్న అతడు, తీరా శోభనానికి సిద్దమైన సమయంలో పోలీసులు వచ్చి అసలు విషయం వెల్లడించారు. విషయం తెలుసుకున్న వధువు తరపు బంధువులు పెద్ద ప్రమాదం నుంచి గట్టెక్కినందుకు ఊపిరి పీల్చుకున్నారు.
దీంతో ఓ నవ వధువు జీవితాన్ని నాశనం కాకుండా కాపాడినవారయ్యారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. వివాహాం జరిగిన మూడో రోజుకు శోభన ముహూర్తం నిర్ణయించారు ఇరువైపుల పెద్దలు. దీంతో ఆరోజు ఏర్పాట్లన్ని చేసి, నవ వధువును అబ్బాయి గదిలోకి పంపించారు. కొత్త పెళ్లి కూతురు శోభనం గదిలో అడుగుపెట్టడమే ఆలస్యం, పోలీసులు వచ్చి జరిగిన విషయం చెప్పి శోభనాన్ని రద్దు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నాగళ్లదిబ్బ గ్రామంలో ఈ నెల 18వ తేదీన ఘటన చోటు చేసుకుంది.
పెళ్లి కొడుకుకి ఎయిడ్స్ ఉందన్న విషయం పోలీసులకు ఎలా తెలిసిందంటే.. పెళ్లికి ముందు ఓసారి విదేశాలకు వెళ్లడానికి సిద్దమైన అతగాడికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఎయిడ్స్ ఉన్నట్టు నిర్దారణ అయింది. దీంతో అతనికి విదేశాలకు వెళ్లడానికి అనుమతులు నిరాకరించారు. ఈ విషయం ఆ పెళ్లి కొడుకుకి కూడా తెలుసు. అన్నీ తెలిసి కూడా యువతిని పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని బలి చేయబోయాడు.
ఈ నేపథ్యంలోనే.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి స్త్రీ-శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారమివ్వడంతో.. పోలీసులను తీసుకుని సదరు ఇంటికి రంగప్రవేశం చేశారు అధికారులు. అసలు విషయాన్ని ఇరు వైపుల కుటుంబ సభ్యులకు చెప్పి శోభనం జరగకుండా అడ్డుపడ్డారు. దీంతో యువతి జీవితాన్ని తృటిలో బలిపీఠం నుంచి తప్పించినవారయ్యారు. ఏదేమైనా.. ఈ విషయంలో తక్షణం స్పందించిన అధికారులు, పోలీసుల పనితీరును అభినందించాల్సిందే.