నా భర్తకు అందమైన స్త్రీలంటే ఇష్టం: మాజీ మంత్రి భార్య
న్యూఢిల్లీ: ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్నాథ్ భారతి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చేలరేగింది. సోమ్నాథ్ భారతి వ్యాఖ్యలపై నెటిజన్లతో పాటు ఆయన భార్య లిపికా మిత్ర కూడా మండిపడ్డారు. తన భర్తకు కేవలం అందమైన మహిళలంటేనే ఇష్టమని, తనలా సాధారణంగా ఉండేవాళ్లను ఆయన పట్టించుకోరని, అందుకే తనను కూడా పట్టించుకోవడం మానేశారని ఆమె తెలిపారు.
మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆయన పట్ల తాను చాలా ప్రేమ చూపించేదాన్ని అని, కానీ ఆయనకు మాత్రం అందమైన మహిళలంటేనే ఇష్టమని అన్నారు. తనను పట్టించుకోకుండా అందమైన అమ్మాయిలనే పట్టించుకునేవారని ఆమె పేర్కొన్నారు.
ఇప్పడు ఆయన చేసిన ప్రకటన కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. తాను సాధారణ మహిళనని, తనలా సాధారణంగా ఉండే మహిళలను ఎవరు మాత్రం చూస్తారని, తమకు ఈ సమాజంలో స్థానం లేదని లిపిక ఆవేదన వ్యక్తం చేశారు. సోమనాథ్ భారతి తనని వేధిస్తున్నారంటూ ఆయన భార్య లిపిక గతంలో గృహ హింస చట్టం కింద ఆయనపై కేసు పెట్టారు.
ప్రస్తుతం వారిద్దరూ వేరు వేరుగా ఉంటున్నారు. ఢిల్లీలో అందమైన ఆడవాళ్లు అర్ధరాత్రి ఒంటరిగా ధైర్యంగా తిరగాలంటే పోలీస్ వ్యవస్థ మొత్తం తమ పార్టీ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని మహిళల భద్రతపై ఢిల్లీ అసెంబ్లీలో సోమనాథ్ భారతి మాట్లాడారు. భారతి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు శర్మిష్ఠ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యాయ శాఖ మంత్రిగా ఉంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి దొంగ సర్టిఫికెట్లతో చిక్కి పోయిన సోమనాథ్ భారతి నోటిలో అంతకంటే మంచిమాటలు ఎలా వస్తాయని వ్యంగంగా అన్నారు. అయితే ఈ విషయంపై మళ్లి స్పందించిన సోమనాథ్ భారతీ తను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.