రంగంలోకి సోనియా: నితీష్తో లాలూ రాజీకొచ్చారు, ఇలా...
బీహార్లోని మహాకూటమి ప్రభుత్వంలో పొడసూపిన చీలిక క్రమేణా పెద్దదవుతున్నట్లు కనిపిస్తున్నా ప్రధాన బాగస్వామ్య పక్షాలైన జనతాదళ్ (యునైటెడ్), ఆర్జేడీ మధ్య రాజీ ఫార్ములా రూపు దిద్దుకుంటున్నదని వార్తలొస్తు
పాట్నా: బీహార్లోని మహాకూటమి ప్రభుత్వంలో పొడసూపిన చీలిక క్రమేణా పెద్దదవుతున్నట్లు కనిపిస్తున్నా ప్రధాన బాగస్వామ్య పక్షాలైన జనతాదళ్ (యునైటెడ్), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) మధ్య రాజీ ఫార్ములా రూపు దిద్దుకుంటున్నదని వార్తలొస్తున్నాయి.
2006లో రైల్వే శాఖ మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్.. ఐఆర్సీటీసీకి చెందిన రెండు హోటళ్ల నిర్వహణ కాంట్రాక్ట్ అప్పగింత కోసం తన కుటుంబానికి మూడెకరాల భూమి అతి చౌక ధరకు దఖలు పర్చుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇందులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, వారి కుమారుడు - డిప్యూటీ సీఎం తేజస్వి ప్రసాద్ యాదవ్లపై కేసు నమోదైందీ ఆ వెంటనే సీబీఐ దాడులు జరిగినప్పటి నుంచి తేజస్వి రాజీనామాకు డిమాండ్లు విమర్శల యుద్ధం నడుస్తోంది. ప్రత్యేకించి సీఎం నితీశ్కుమార్ సారథ్యంలోని యునైటెడ్ జనతాదళ్ (జేడీ - యూ) నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
రాజీకి కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా యత్నం
దేశ జనాభాలో మూడో స్థానంలో బీహార్ రాష్ట్ర రాజకీయాలపైనే కేంద్రంలోని అధికార బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ద్రుష్టి సారించారు. ప్రధాని మోదీని 2019 లోక్సభ ఎన్నికల్లో నిలువరించేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయడానికి బీహార్ రాష్ట్ర రాజకీయాలు కీలకంగా మారాయి. అందువల్లే జాతీయ రాజకీయాలన్నీ ప్రస్తుతం బీహార్పై ద్రుష్టి పెట్టాయి. ఈ క్రమంలో మహా కూటమి మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రంగంలోకి దిగారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్లతో వేర్వేరుగా సంప్రదించారు. రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు.
Recommended Video
తేజస్వి రాజీనామా తర్వాతే ఏదైనా..
కళంకితుడన్న ముద్ర పడిన లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ స్థానే లాలూ కూతురు రోహిణికి చోటు కల్పించాలని ఆర్జేడీ నాయకత్వం ప్రత్యామ్నాయ ప్రతిపాదన ముందుకు తెచ్చారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా రాజీనామా చేసే వరకు సీఎం నితీశ్ కుమార్.. లాలూ కూతురు రోహిణికి క్యాబినెట్లో చోటు కల్పించే విషయమై తన మాట బయట పెట్టడానికి సిద్ధంగా లేరని తెలుస్తున్నది.
విచక్షణతోనే వ్యవహరిస్తున్నామన్న జేడీయూ
జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి ఢిల్లీలో మాట్లాడుతూ ‘అవినీతిపై సీఎం నితీశ్ వైఖరి ఏమిటో అందరికీ తెలిసిందే. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోరు' అని తెలిపారు. తమ వైఖరిలో మార్పు లేదని, విచక్షణతోనే వ్యవహరిస్తున్నామన్నారు. ఈ వివాదంలో రాజ కుదిర్చేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదర్శ నాయకురాలని వ్యాఖ్యానించారు. తేజస్వి యాదవ్పై వచ్చిన ఆరోపణలపై సంపూర్ణ వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆర్జేడీపై ఉందన్నారు. ఆ పార్టీ మరో అధికార ప్రతినిధి నీరజ్కుమార్ మాట్లాడుతూ ప్రతిపక్షాల నోరు మూయించడానికి ఆ ఆస్తులను ఎలా సంపాదించిందీ చెబితే సరిపోతుందని తెలిపారు.
అహంకారం ప్రదర్శించరాదని ఆర్జేడీ హెచ్చరికలు
జేడీయూ నాయకుడు సునీల్ సింగ్ మాట్లాడుతూ సీఎం నితీశ్ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఏచర్యనైనా చూస్తూ ఊరుకోబోమని అన్నారు. 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీకి అత్యధికంగా 80, జేడీ(యు)కు 71, కాంగ్రెస్కు 27 సీట్లు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే తమకు 80 మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి గుర్తించుకోవాలని ఆర్జేడీ నేత రామచంద్ర పూర్వే హెచ్చరించారు. దీనిపై జేడీ(యు) ప్రతినిధి సంజయ్ సింగ్ వ్యాఖ్యానిస్తూ ఆరోపణలపై వాస్తవాలు చెప్పాలే తప్ప, సీట్లు ఉన్నాయని అహంకారం ప్రదర్శించ కూడదని అన్నారు. 2010 ఎన్నికల్లో ఆ పార్టీకి 22 సీట్లే వచ్చాయని, గత ఎన్నికల్లో నితీశ్ వల్లే సీట్లు పెరిగిన విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పారు.
తేజస్వీ రాజీనామా చేస్తారా?
బీహార్లో మహాకూటమి సిద్ధాంతాలపై ఏర్పాటైందని, ఇది చెక్కు చెదరదని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఈ వివాదంలో సోనియా జోక్యం చేసుకోవాలని మిత్రపక్షాల నేతలు కొందరు చేస్తున్న సూచనలపై స్పందిస్తూ, ఈ సమస్యపై వ్యాఖ్యానించే ముందు కూటమిలోని మూడు పార్టీల నాయకులు తొలుత ఆయా పార్టీల అధినేతలతో సంప్రదిస్తే మంచిదని అన్నారు.ఈ వివాదం నేపథ్యంలో రాజీనామా చేయాలని తేజస్వీ భావిస్తున్నట్టు ప్రచారం జరిగింది. దాణా కుంభకోణం కేసులో విచారణకు ప్రస్తుతం రాంచీలో ఉన్న లాలూ శుక్రవారం సాయంత్రం పాట్నాకు చేరుకున్నారు. ఆయనతో సంప్రదించాక ప్రకటన చేస్తారని ఒక వర్గం మీడియాలో వచ్చిన వార్తలను దీనిని తేజస్వీ ఖండించారు. ఇది హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.