దగ్గరి నుండి చూశా: మోడీ, అసోం సీఎంగా సోనోవాల్ ప్రమాణం
గౌహతి: అసోం ముఖ్యమంత్రిగా శరబానంద సోనోవాల్ మంగళవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాలలో తొలిసారి కమలం వికసించింది.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. అసోం ప్రజలకు సేవ చేసే భాగ్యం సోనోవాల్కు దక్కిందన్నారు. సోనోవాల్పై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అన్నారు. సమస్యల నుంచి రాష్ట్ర ప్రజలను ఆదుకొనేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తారన్నారు.
రాష్ట్రాభివృద్ధి కోసం సోనోవాల్కు ప్రజలు చక్కని అవకాశం కల్పించారన్నారు. సోనోవాల్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను దగ్గరనుంచి పరిశీలించినట్లు ప్రధాని మోడీ చెప్పారు. ప్రజల కలలను ఆయన సాకారం చేస్తారన్నారు. ఆయన నేతృత్వంలో అసోం సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందన్నారు.