రజనీకాంత్ ఫస్ట్ వికెట్ డీఎంకే: జగద్రక్షకన్ ఎంట్రీ ? జయలలితనే ఎదరించాడు, ఎవరంటే ?
రజనీకాంత్ తన కొత్త పార్టీలో చేరాలని డీఎంకే పార్టీలోని సీనియర్ నాయకుడు జగద్రక్షకన్ వర్తమానం పంపించారని వెలుగు చూడటంతో స్టాలిన్ వర్గం ఉలిక్కిపడింది.
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనాలు సృష్టించడానికి సిద్దం అవుతున్నారని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా ? రారా ? అనే చర్చ జరుగుతున్న సమయంలో సూపర్ స్టార్ తెర వెనుక రాజకీయాలు మొదలు పెట్టేశారని వెలుగు చూసింది.
రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం జరిగితే తమిళనాడులోని ద్రవిడ పార్టీలతో పాటు జాతీయ పార్టీల నాయకులు ఆయన నేతృత్వంలోని కొత్త పార్టీలో చేరడానికి క్యూలో ఉన్నారు. అయితే రజనీకాంత్ ఆచితూచి అడుగులు వేసి సీనియర్ నాయకులను తన పార్టీలోకి ఆహ్వానించడానికి సిద్దం అయ్యారని సమాచారం.
రజనీ మొదటి టార్గెట్ డీఎంకే !
రజనీకాంత్ డీఎంకే పార్టీలోని సీనియర్ నాయకుడు జగద్రక్షకన్ ను తన కొత్త పార్టీలో చేరాలని వర్తమానం పంపించారని బుధవారం వెలుగు చూడటంతో స్టాలిన్ వర్గం ఉలిక్కిపడింది. డీఎంకే చీఫ్ కరుణానిధికి అత్యంత సన్నిహితుడు, కేంద్ర మాజీ మంత్రి అయిన జగద్రక్షకన్ పార్టీని వీడితే పెద్ద సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని డీఎంకే వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
ఎవరీ జగద్రక్షకన్
అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ కు అత్యంత సన్నిహితుడు జగద్రక్షకన్. 1980 శాసన సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ నుంచి ఉత్తిరమిరూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎస్. రాందాస్ పై విజయం సాధించారు. ఎంజీఆర్ హయాంలో కీలకమైన నామినేటెడ్ పదవిలో జగద్రక్షకన్ కొనసాగారు. 1985లో అదే పార్టీ నుంచి చెంగలపట్టు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపోందారు.
జయలలితను ఎదిరించిన జగద్రక్షకన్
ఎంజీఆర్ మరణం తరువాత జయలలిత నాయకత్వాన్ని వ్యతిరేకించిన జగద్రక్షకన్ జానకీ రామచంద్రన్ (ఎంజీఆర్ భార్య) వర్గంలో చేరారు. 1989 తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో ఉత్తిమిరూర్ నియోజక వర్గం నుంచి జయలలిత వర్గానికి వ్యతిరేకంగా పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయారు.
వన్నియర్ కులం, సొంత పార్టీ
తమిళనాడులో బలమైన వన్నియర్ కులంలో జన్మించిన జగద్రక్షకన్ విద్యాంతుడు. ఈయన ఇప్పటి వరకు 30 వరకు పుస్తకాలు రాశారు. 2004లో వీర వన్నియర్ పేరవై పేరుతో సొంత పార్టీని ప్రారంభించి తన సత్తా చాటుకున్నారు. తరువాత ఆయన తన సొంత పార్టీని డీఎంకే-కాంగ్రెస్ కూటమిలో విలీనం చేశారు.
మూడు రాష్ట్రాల్లో మెడికల్ కాలేజ్ లు
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని కల్లినంగమలి ప్రాంతంలో 1950 ఆగస్టు 15వ తేదీ జన్మించిన జగద్రక్షకన్ తమిళనాడులో శ్రీబాలాజీ మెడికల్ కాలేజ్, ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. పుదుచ్చేరీ, కర్ణాటకలో మెడికల్ కాలేజ్ లు ప్రారంభించారు. 2009లో ఓ ఆంగ్ల దిన పత్రిక నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ లో తన మెడికల్ కాలేజీల్లో 20 లక్షల రూపాయలు డోనేషన్లు తీసుకుని విద్యార్థులకు సీట్లు విక్రయించారని అడ్డంగా బుక్కయ్యారు.
జయలలిత దెబ్బతో పరుగో పరుగు
జయలలితను ఎదిరించి జానకీ రామచంద్రన్ గ్రూప్ లో ఉన్న జగద్రక్షకన్ అమ్మ రాజకీయ దెబ్బకు తట్టుకోలేక కరుణానిధి ఆశీస్సులతో డీఎంకే పార్టీలో చేరారు. 1999లో, 2009లో రెండుసార్లు అరక్కూనం లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
బొగ్గు స్కాంలో చిక్కుకుని
2009 జూన్ 28 నుంచి 2013 మార్చి 20వ తేది వరకు కేంద్ర మంత్రిగా (మూడు సార్లు శాఖలు మార్చారు) పని చేసిన జగద్రక్షకన్ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పని చేసే సమయంలో ముడుపులు తీసుకుని అనేక టీవీ చానల్స్ కు నియమాలు ఉల్లంఘించి అనుమతులు ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతే కాకుండా బొగ్గు స్కాంలో చిక్కుకుని విలవిలలాడి తన మంత్రి పదవిపోగోట్టుకున్నారు.
రూ. 5 కోట్ల నుంచి రూ. 70 కోట్లు
2009 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన అఫిడవిట్ లో తన ఆస్తి విలువ రూ. 5 కోట్ల రూపాయలు చూపించిన జగద్రక్షకన్ 2009లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తన ఆస్తి రూ. 70 కోట్లు అని అఫిడవిట్ సమర్పించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
రజనీపై అభిమానుల ఆగ్రహాం
డీఎంకే సీనియర్ నాయకుడు, బొగ్గు స్కాంతో పాటు అనేక విషయాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగద్రక్షకన్ ను రజనీకాంత్ తన రాజకీయ పార్టీలోకి ఆహ్వానించారని, ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుసుకున్న ఆయన అభిమానులు తీవ్రఆగహాం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. పార్టీ పెట్టకముందే ఇలాంటి నాయకులు వస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెలుతాయని సూపర్ స్టార్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.