తమిళనాడు మంత్రుల జాతకాలు బయటపెడుతాం: పన్నీర్ వర్గం బాంబు !
తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వంలోని 10 మంది అవినీతి మంత్రుల భాగోతాలు, పుట్టుపూర్వోత్తరాలు మొత్తం మా దగ్గర ఉన్నాయని, త్వరలో వాటిని బయటపెడుతామని పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులు బాంబు .
చెన్నై: శశికళ వర్గంలోని అవినీతి మంత్రుల బండారం బయటపెడుతామని, ప్రజల్లో వారిని దోషులుగా నిలబెడుతామని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు హెచ్చరించారు. త్వరలోనే 10 మంది అవినీతి మంత్రుల జాతకాలు విడుదల చేస్తామని బాంబు పేల్చారు.
ఆర్ కే నగర్ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పన్నీర్ సెల్వం వర్గంలోని మధుసూదనన్ కు మద్దతుగా ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్బంగా పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులు మీడియాతో మాట్లాడారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మంత్రి వర్గంలోని మంత్రుల అవినీతికి అంతేలేకుండా పోయిందని విమర్శించారు. శశికళ జైలు నుంచి తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు.
ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వంలోని 10 మంది అవినీతి మంత్రుల భాగోతాలను త్వరలో బయటపెడుతామని వారు హెచ్చరించారు. ఆ మంత్రులు అవినీతి గురించి పుట్టుపూర్వోత్తరాలు మొత్తం మా దగ్గర ఉన్నాయని పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులు బాంబు పేల్చారు.