హమ్మయ్య.. భానుడు శాంతించాడు.. వరుణుడు కరుణించాడు.. మూడు రోజులు ముందుగానే..
మొత్తానికి వాతావరణం చల్లబడింది. నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే ప్రజలను పలకరించాయి. ఇప్పటికే అక్కడక్కడా వర్షాలు కురిపిస్తున్నాయి.
ఢిల్లీ: హమ్మయ్య.. భానుడు శాంతించాడు.. వరుణుడు కరుణించాడు. మొత్తానికి వాతావరణం చల్లబడింది. నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే ప్రజలను పలకరించాయి. ఇప్పటికే అక్కడక్కడా వర్షాలు కురిపిస్తున్నాయి.
నికోబార్ దీవులు, మొత్తం దక్షిణ అండమాన్ సముద్రం, ఉత్తర అండమాన్లోని కొంత భాగం, బంగాళాఖాతంలోని ఈశాన్య ప్రాంతంపై రుతుపవనాలు ఆవరించాయని ఆదివారం భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది.
ఆ ప్రాంతంలో నైరుతి పవనాలు బలంగా వీస్తున్నాయని, ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. సాధారణంగా ఈ ప్రాంతంలో మే 17న రుతుపవనాలు ప్రారంభమవుతాయి.
రానున్న 72 గంటల్లో అండమాన్-నికోబార్ దీవులు అంతటా రుతుపవనాలు విస్తరించనున్నాయి. అయితే నిర్ణీత తేదీల ప్రకారం ఇవి కేరళ తీరాన్ని తాకుతాయా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేమని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కె.జి.రమేష్ తెలిపారు.
సాధారణంగా జూన్ ఒకటో తేదీన కేరళకు రుతు పవనాలు వస్తాయి. దీనినే దేశంలో వర్షాలు ప్రారంభమయ్యే తేదీగా పరిగణిస్తారు. ఈసారి అండమాన్-నికోబార్ దీవులకు రుతు పవనాలు ముందుగా వచ్చినప్పటికీ, కేరళకు కూడా ముందుగానే వస్తాయని భావించలేమని రమేష్ చెప్పారు.
మరోవైపు ప్రైవేటు వాతావరణ హెచ్చరికల సంస్థ 'స్కైమెట్'కు చెందిన ప్రధాన వాతావరణ నిపుణుడు మహేష్ పలవత్ కూడా జూన్ ఒకటో తేదీకి ఒక రోజు అటూ ఇటుగా కేరళకు కూడా రుతు పవనాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
రానున్న 24 గంటల్లో అండమాన్, నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం గంటకు 40 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న రుతుపవనాలు, రానున్న రెండు మూడు రోజుల్లో గంటకు 50 కి.మీ వేగాన్ని అందుకుంటాయని పేర్కొన్నారు.