మా సీఎంకు చేతబడి చేయించింది: ఎంఎల్ సీ
లక్నో: యాదవ్ పరివార్ లో రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎంఎల్ సీ (ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ వర్గీయుడు) ఉదయ్ వీర్ సింగ్, ఎస్ పీ చీఫ్ ములాయం సింగ్ రెండవ భార్య సాధనా గుప్తా యాదవ్ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
మా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఎదుగుదలను చూడలేని ఆయన సవతి తల్లి సాధనా గుప్తా మా నాయకుడికి (అఖిలేష్ యాదవ్) చేతబడి చేయించిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా ములాయం సింగ్ యాదవ్ కు ఈ విషయంపై లేఖ రాయడంతో రచ్చ మొదలైయ్యింది.
శివపాల్ యాదవ్ తో కుమ్మక్కు అయిన సాధనా గుప్తా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను నిర్వీర్యం చేసేందుకు కుట్రపన్నుతున్నారని, చేతబడి చేయించి ఆయనను అంతం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని లేఖలో రాశారు.
అంతే కాకుండ ములాయం జీ మీరు పదవి నుంచి వైదొలిగి పార్టీ బాధ్యతలను అఖిలేష్ యాదవ్ కు అప్పగించాలని లేఖలో ఎంఎల్ సీ ఉదయ్ వీర్ సింగ్ డిమాండ్ చేశారు. అయితే తాను అంతర్గతంగా రాసిన లేఖ మీడియాలకు ఎలా లీక్ అయ్యింది ? అనే విషయం తనకు తెలీదని అన్నారు.
ఈ లేఖపై ములాయం సింగ్ యాదవ్ వర్గీయులు అగ్గిమీద గుగ్గిలమై ఉదయ్ వీర్ సింగ్ ను తీవ్రస్థాయిలో విమర్శించారు. మా నాయకుడు ములాయం సింగ్ యాదవ్ ను ఇంకో సారి ఎమైనా అంటే నీ తాట తీస్తాం అని హెచ్చరించారు.
ఆయన భిక్షతో ఎంఎల్ సీ అయిన నీవా మాట్లాడేది అని అంటున్నారు. నువ్వు చేస్తున్న ఆరోపణలకు వందల సంఖ్యలో కూడా ఓట్లు పడవని గుర్తు చేశారు. చేతబడి చేయించాల్సిన అవసరం మా నాయకురాలికి లేదని ములాయం వర్గీయులు అన్నారు.
ములాయం సింగ్ యాదవ్ మొదటి భార్య ముల్లీ యాదవ్ (సీఎం అఖిలేష్ తల్లి) 2003లో మరణించారు. పార్టీ కార్యకర్తగా పని చేస్తున్న సాధనా గుప్తాతో ములాయం సింగ్ యాదవ్ కు పరిచయం అయ్యింది.
ఇద్దరు చనువుగా దగ్గరయ్యారు. ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఎక్కడ పెళ్లి చేసుకున్నారు అనే విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. 1988లో ములాయం, సాధనకు ప్రతీక్ యాదవ్ అనే కుమారుడు జన్మించాడు.
యూపీలో ఇప్పుడు ప్రతీక్ యాదవ్ పెద్ద బిల్డర్. రెండో పెళ్లి విషయాన్ని వీరు రహస్యంగా దాచిపెట్టారు. అయితే ప్రత్యర్థి పార్టీలు ములాయం సింగ్ యాదవ్ ను టార్గెట్ చేసుకుని రెండో పెళ్లి విషయంలో విమర్శలకు దిగాయి.
విసిగిపోయిన ములాయం 2007లో సాధన గుప్తా యాదవ్ తన రెండో భార్య అని అధికారికంగా దృవీకరించారు. అప్పటి నుంచి సాధన గుప్తా పార్టీలో నెంబర్ వన్ లేడీగా చలామణి అవుతున్నారు. అంతర్గత సంక్షోభంలో సాధన తన భర్త ములాయం సింగ్ కు మద్దతుగా నిలిచారు. అఖిలేష్ యాదవ్ కు వ్యతిరేకంగా సాధనా గుప్తా పావులు కదుపుతున్నారని విమర్శలు ఎక్కువ అయ్యాయి.