చెన్నైలో హంగామా: జైలు నుంచి ఇంటికి జయలలిత
బెంగళూర్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడియంకె అధినేత జయలలిత జైలు నుంచి విడుదలయ్యారు. బెంగళూర్ విమానాశ్రయం నుంచి చార్టర్డ్ విమానాంలో ఆమె చెన్నై చేరుకుంటారు. చెన్నై విమానాశ్రంలో ఆమెకు స్వాగతం చెప్పడానికి ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం సిద్ధంగా ఉన్నారు. శనివారం మూడున్నర గంటల ప్రాంతంలో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు.జయలలిత బెంగళూర్లోని జైలు నుంచి చెన్నైలోని తన నివాసానికి చేరుకున్నారు. జయలలిత కోసం చెన్నై విమానాశ్రయం వద్ద అన్నాడియంకె నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎదురు చూశారు. సంబరాలు చేసుకున్నారు. నృత్యాలు చేశారు.
చెన్నై విమానాశ్రయం నుంచి ఆమె నివాసం వరకం అన్నాడియంకె కార్యకర్తలు మానవహారం చేపట్టారు. భారీ వర్షాన్ని కూడా వారు లెక్క చేయలేదు. తమ అమ్మ విడుదలకు సంతోషించి ఆకాశం వర్షించిందని వారు సంబరపడిపోయారు. అంతకు ముందు జయలలిత విడుదలకు బెంగళూర్ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమె ఏ క్షణంలోనైనా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక కోర్టు ఆమె విడుదలకు ఆదేశాలు జారీ చేసింది.
పూచీకత్తు తీసుకున్న తర్వాత ప్రత్యేక న్యాయమూర్తి జాన్ మైఖేల్ జయలలిత విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రతిని కూడా జయలలిత తరఫు న్యాయవాది ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. జయలలిత ప్రియసఖి శశికళ, ఆమె బంధవులు సుధాకరన్, ఎలవరసి కూడా ఆ షరతులు పూరించారు.
జయలలితతో పాటు మిగతా ముగ్గురు కూడా ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. వారంతా శనివారం సాయంత్రం విడుదల కావచ్చునని భావిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రత్యేక కోర్టు జయలలితకు, మిగతా ముగ్గురికి నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధించింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లు కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆమెకు డిసెంబర్ 18వ తేదీ వరకు తాత్కాలిక బెయిల్ కూడా మంజూరు చేసింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు నాలుగేళ్ల కారాగా శిక్ష విధిస్తూ, వంద కోట్ల జరిమానా వేస్తూ సెప్టెంబర్ 27వ తేదీన ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. జయలలిత పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు అక్టోబర్ 7వ తేదీన తిరస్కరించింది. దాంతో ఆమె అక్టోబర్ 9వ తేదీన సుప్రీంకోర్టుకు వెళ్లారు.