సాధ్యం కాదు: ఎపికి ప్రత్యేక హోదాపై తేల్చేసిన జైట్లీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ఇప్పట్లో ప్రత్యేక హోదా లభించే అవకాశాలు కనిపించడం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ఈ విషయాన్ని సూత్రప్రాయంగా వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామమోహన్ రావులతో చర్చలు జరిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రాలకు ఇకమీదట ప్రత్యేక హోదా ఇవ్వరాదని 13వ ఆర్థిక సంఘం సిఫారసు చేసినందున ఆంధ్రకు హోదా ఇవ్వటం సాధ్యపడకపోచ్చని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని చట్టబద్ధంగా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని మాత్రమే అన్నారు.
మార్చి నెలాఖరుకు ఆంధ్రకు కేంద్రం నుంచి పది వేల కోట్లు రూపాయలు అందుతాయని సుజనా చౌదరి చేసిన ప్రకటనను ఆయన దృష్టికి తీసుకురాగా, ఇప్పటి వరకు కేంద్రం రాష్ట్రానికి దశలవారీగా నిధులు కేటాయించిందన్నారు. సుజనాచౌదరి చెప్పినదానికి ఇది దాదాపుగా దగ్గరలో ఉంటుందని అరుణ్ జైట్లీ వివరించారు.
అయితే రాష్ట్రానికి ఇంతవరకు కేంద్రం నుంచి అందిన మొత్తం ఎంత? అనే ప్రశ్నకు జైట్లీ స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా ‘మీరే లెక్కలు వేసుకోండి' అంటూ వెళ్లిపోయారు. పునర్విభజన చట్టంలో ఇటు ఆంధ్రకు, అటు తెలంగాణకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని జైట్లీ భరోసా ఇచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయంగా ఎలాంటి వివక్షా ఉండబోదని జైట్లీ అన్నారు.
కేంద్రం నుంచి మార్చి నెలాఖరుకు రాష్ట్రానికి 8,350 కోట్లు తెచ్చామని సుజనా చౌదరి ప్రకటించారు. నెలాఖరుకు కేంద్రం నుంచి పదివేల కోట్ల ఆర్థిక సాయం తెస్తామని ఆయన గతంలో ప్రకటించటం తెలిసిందే. అయితే కేంద్రం నుంచి 8,357 కోట్లు సాధించటం తమకు సంతృప్తికరంగా ఉందని సుజనా అన్నారు. పోలవరం నిర్మాణానికి, రాజధాని నిర్మాణానికి ఎప్పటికప్పుడు కేంద్రం రాష్ట్రం చేసే ఖర్చుకు అనుగుణంగా నిధులు విడుదల చేసేందుకు అంగీకరించిందని వెల్లడించారు.
ఈ ఏడాది ఆర్థిక లోటు అధిగమించేందుకు, ఇతర వ్యయాలు భరించేందుకు కేంద్రం ఉదారంగా నిధులిచ్చిందని సుజనాచౌదరి చెప్పారు. ఇంతవరకు ఆర్థిక లోటును భరించేందుకు 2,300 కోట్లు ఇచ్చారన్నారు. గోదావరి పుష్కరాలకు వంద కోట్లు కేంద్రం విడుదల చేసిందన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోలేకపోవటంతో అవి మురిగిపోయాయని, అయితే ఇప్పుడు తాము వాటిని కూడా తిరిగి సంపాదించుకుంటున్నట్టు చెప్పారు.