స్పెషల్ ట్రీట్మెంట్ కోసం ముస్లీంలు పాక్ వెళ్లాలి, వందేమాతరం పాడాలి: శివసేన
ముంబై: భారత దేశంలోని ముస్లీంలు తమకు ఇక్కడ ప్రత్యేక ట్రీట్మెంట్ (రిజర్వేషన్లు) కోరుకుంటే వారు అందుకు పాకిస్తాన్ వెళ్లాలని శివసేన మంగళవారం సూచించింది. శివసేన పత్రిక అయిన సామ్నా ముస్లీంల రిజర్వేషన్ల పైన స్పందించింది. వారు (ముస్లీంలు) ఈ దేశం నుండి ఏదైనా కావాలనుకుంటే.. మొదట భారత దేశాన్ని మాతృదేశంగా అంగీకరించాలని, అలాగే వందేమాతరం పాడాలని పేర్కొంది.
మహారాష్ట్రంలో వెనుకబడిన ముస్లీంలకు రిజర్వేషన్లు కల్పించాలని మజ్లిస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో శివసేన దాని పైన స్పందించింది. ముస్లీంలకు రిజర్వేషన్లు కావాలంటే పాకిస్తాన్ వెళ్లాలని సూచించింది.
విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వారి పైన ఫడ్నవీస్ ప్రభుత్వం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. మహారాష్ట్రంలో ముస్లీంలకు తీవ్ర అన్యాయం జరిగిందంటున్న వారు తీవ్రవాదులు, ముస్లీం తీవ్రవాదుల హింసాత్మక చర్యల వల్ల ఎంతమంది హిందువులు నష్టపోయారో తెలుసా అని ప్రశ్నించింది.
రిజర్వేషన్లు మత ప్రాతిపదికన కాకుండా వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఉండాలని పేర్కొంది. పేద ముస్లీంలకు రిజర్వేషన్లు ఉండాలని, అయితే వారు ముస్లీం అయినందుకు కాదని, భారత దేశ పౌరుడు అయినందుకు అన్నారు.