చైనాకు శ్రీలంక షాక్: అక్కడ పెత్తనం కుదరదు.. భారత్కు ముప్పు తప్పింది..
హిందూమహాసముద్రంలోని హంబన్ తోట ఓడరేవులో చైనా అధికారాన్ని గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
కొలంబో: చైనా-శ్రీలంకల మధ్య ఓడరేవు ఒప్పందం ఆసక్తికర మలుపు తిరిగింది. ప్రజల నుంచి ఎదురైన తీవ్ర ఒత్తిడి మేరకు శ్రీలంక ప్రభుత్వం చైనాను నియంత్రించే దిశగా అడుగువేసింది. హిందూమహాసముద్రంలోని హంబన్ తోట ఓడరేవులో చైనా అధికారాన్ని గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
నిజానికి ఈ ఓడరేవుకు అయ్యే ఖర్చులో ఎక్కువ భాగం చైనానే స్పాన్సర్ చేస్తోంది. దాదాపు 1.5బిలియన్ డాలర్ల వ్యయంతో ఈ పోర్టును నిర్మించేందుకు చైనా ముందుకు వచ్చింది. దీంతో ఓడరేవులో 80శాతం అధికారాలను ఆ దేశానికే కట్టబెడుతూ శ్రీలంక కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
అయితే శ్రీలంక కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంపై అక్కడి ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తాయి.ఇటు అమెరికా, జపాన్,భారత్ లు కూడా భద్రతాపరమైన సవాళ్లపై ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో శ్రీలంక కేబినెట్ పై మరింత ఒత్తిడి పెరిగినట్లయింది.
అన్నివర్గాల నుంచి వస్తున్న ఒత్తిడితో.. మరోసారి దీనిపై కేబినెట్ మీటింగ్ నిర్వహించిన శ్రీలంక ప్రభుత్వం.. కాస్త వెనక్కి తగ్గింది. హంబన్ తోట ఓడరేవులో చైనా అధికారులకు కత్తెర పెడుతున్నట్లు చెప్పింది. దీంతో చైనా మిలటరీ కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లయింది.
కాగా, 2014లో హంబన్ తోట ఓడరేవులో చైనా తన సబ్ మెరైన్ ను ఉంచిన సంగతి తెలిసిందే. చైనాకు ఇంత స్వేచ్చ ఇవ్వడం పట్ల భారత్ అప్పట్లో ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీలంకతో చర్చలు కూడా జరిపింది. భారత్ ఒత్తిడితో.. ఈ ఏడాది మే నెలలో మరోమారు సబ్ మెరైన్ ను ఓడరేవులో ఉంచుతామన్న ప్రతిపాదనను శ్రీలంక తిరస్కరించింది.
హంబన్ తోట ఓడరేవులో చైనా అధికారాలను తగ్గిస్తూ శ్రీలంక కేబినెట్ ఆమోదించిన ప్రతిపాదనలు.. ఈ వారంలో పార్లమెంటుకు ముందుకు వస్తాయని కేబినెట్ అధికార ప్రతినిధి దయాసిరి జయశేఖర తెలిపారు. అయితే ప్రతిపాదనలోని అంశాలను ఆయన వెల్లడించలేదు. ఇక శ్రీలంక కేబినెట్ నిర్ణయంపై చైనా అధికార ప్రతినిధిని సంప్రదించగా.. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.