భక్తురాలిపై 154 సార్లు రేప్ చేశాడని స్వామీజిపై కేసు
బెంగళూరు: భక్తురాలు, గాయని మీద స్వామీజి అత్యాచారం చేశాడని ఆరోపణలు రావడంతో ఆ మఠంలోని భక్తులు హడలిపోయారు. స్వామీజీని ఎప్పుడైనా అరెస్టు చెయ్యవచ్చని పోలీసు వర్గాలు అంటున్నాయి. స్వామీజి అత్యాచారం చేశాడని అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది.
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హోసనగరలోని రామచంద్రాపుర మఠాధిపతి శ్రీ రాఘవేశ్వర భారతీ స్వామీజి మీద వచ్చిన అత్యాచారం ఆరోపణలు రుజువు అయ్యాయని సీఐడి అధికారులు అంటున్నారు. ఏ సమయంలోనైనా స్వామీజిని అరెస్టు చేసే అవకాశం ఉంది.
బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న ఓ మహిళ మఠంలో రామకథా గాయికిగా పని చేస్తున్నారు. అంతే కాకుండ ఆమె, ఆమె భర్త మఠంలో స్వామీజి భక్తులు. రామకథ చెప్పడానికి వెళ్లిన సమయంలో మఠం దగ్గరకు వెళ్లేవారు.
ఆ సమయంలో స్వామీజి తన మీద అత్యాచారం చేశాడని భక్తురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు సంవత్సరాలలో తన మీద 154 సార్లు అత్యాచారం చేశాడని, విషయం బయటకు చెబితే నిన్ను నీ కుటుంబ సభ్యులను అంతం చేస్తానని బెదిరించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా ఆమె తన దుస్తుల మీద పడి ఉన్న స్వామీజి వీర్యాన్ని పోలీసులకు ఇచ్చింది.
పోలీసులు కేసు నమోదు చేసి దస్తులు, వీర్యాన్ని వైద్య పరీక్షలకు పంపించారు. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని స్వామీజి, మఠం భక్తులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు భార్యాభర్తలను అరెస్టు చేసి జైలుకు పంపించారు.
తమ కుటుంబ సభ్యులకు నిత్యం బెదిరింపు ఫోన్ లు వస్తున్నాయని బాధితురాలి కుమార్తె ఫిర్యాదు చెయ్యడంతో బెంగళూరులోని గిరినగర పోలీసులు స్వామీజి మీద కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు స్వామీజికి విక్టోరియా ఆసుపత్రిలో ఐదు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఎస్సీ, డీఐజీ, ఐజీ దర్యాప్తు చేసిన నివేదికను డీజీపీ, హోం శాఖ అధికారులకు అందివ్వనున్నారు. తరువాత వారి అనుమతితో న్యాయస్థానంలో చార్జ్ షీట్ సమర్పించి స్వామీజిని అరెస్టు చెయ్యాలని సీఐడి అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు.