70 కోట్ల ఆరోపణ, సినీ నిర్మాత అదృశ్యం: ఎస్ఆర్ఎం అధినేత అరెస్టు
చెన్నై:ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం చాన్సలర్ టిఆర్ పచ్చముత్తును సిఐడి అధికారులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు. మోసం చేయడం, తదితర అభియోగాల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం చాన్సలర్, ఐజెకె వ్యవస్థాపకుడైన మచ్చముత్తును గురువారం రాత్రి సిఐడి అధికారులు విచారణకు పిలిచారు.
గురువారం రాత్రంతా విచారించిన సిఐడి అధికారులు శుక్రవారం పచ్చముత్తును అరెస్టు చేశారు. మెడికల్ సీట్లు ఇప్పిస్తామని మోసం చేసిన వ్యవహారంలో చిత్ర నిర్మాత మదన్ కనిపించకుండా పోయాడు. సినీ నిర్మాత వ్యవహారంపై ప్రశ్నించిన సిఐడి అధికారులు పచ్చముత్తును అరెస్టు చేశారు.
ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో మెడికల్ సీట్ల కోసం డబ్బు కట్టినా తమకు ఆడ్మిషన్లు ఇవ్వలేదని ఆరోపిస్తూ వంద మందికిపైగా విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. తమకు సీట్లు ఇప్పిస్తానని పచ్చముత్తుకు సన్నిహితుడైన సినీ నిర్మాత ఎస్ మదన్ తమ డబ్బులు తీసుకున్నాడని విద్యార్థులు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి మే నెలలో మదన్ అదృశ్యమయ్యాడు. దీంతో పచ్చముత్తు చిక్కుల్లో పడ్డారు. మదన్ దాదాపు 70 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు అరోపణలు వచ్చాయి. మద్రాసు హైకోర్టు ఆదేశంతో పచ్చముత్తును సిఐడి అధికారులు విచారణకు పిలిచారు.
కాగా, ఎస్ఆర్ఎం విద్యాసంస్థలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అమరావతిలో 200 ఎకరాల భూమి కేటాయించింది.