ఒక్కన్ని పట్టుకోవడానికి!, ఢిల్లీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఓలా 'కిడ్నాపర్'
గద్వాలకు చెందిన డాక్టర్ శ్రీకాంత్ను కిడ్నాప్ చేసిన ఓలా డ్రైవర్ను పట్టుకోవడం కోసం పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నా.. ఇంతవరకు క్లూ దొరకలేదు.
న్యూఢిల్లీ: చూడటానికి అతనో సాదా సీదా క్యాబ్ డ్రైవరే.. కానీ అతని మైండ్ మాత్రం ప్రొఫెషనల్ కిల్లర్స్ కు ఏమాత్రం తీసిపోదు. సరికదా, అతని స్మార్ట్ స్కెచ్ పోలీసులకు సైతం అంతుపట్టడం లేదు. ఏకంగా 90శాతం తూర్పు ఢిల్లీ పోలీసులంతా ఇప్పుడతని వేటలోనే నిమగ్నమయ్యారు. అయినా సరే ఇప్పటివరకు చిన్న క్లూ కూడా సంపాదించలేకపోయారు.
గద్వాలకు చెందిన మెడికో శ్రీకాంత్ను కిడ్నాప్ చేసిన ఓలా డ్రైవర్ను పట్టుకోవడం కోసం అక్కడి పోలీసులు చేయని ప్రయత్నం లేదు. పోలీసుల నిఘా కదిలికలను ఎప్పటికప్పుడు చేధించుకుంటూ సదరు కిడ్నాపర్ పోలీసులు కంటే స్మార్ట్ గా ఆలోచిస్తున్నాడు. స్వయంగా పోలీస్ అధికారే ఈ మాటను అంగీకరించడం గమనార్హం.
కేసును పర్యవేక్షిస్తున్న తెలుగు పోలీసు అధికారి ఏసీపీ రాహుల్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మొబైల్ సిగ్నల్, జీపీఎస్ వంటి క్లూ కూడా లేకుండా కిడ్నాపర్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. కిడ్నాపర్ చెరలో ఉన్న శ్రీకాంత్కి ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకే తాము ఆచి తూచీ వ్యవహరిస్తున్నామని తెలిపారు.
రోజుకో అడ్రస్:
కిడ్నాపర్ రోజుకో అడ్రస్ లో రోజుకో సిమ్ వాడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పలానా ప్రాంతంలో ఒక సిమ్ కార్డు వాడాడంటే.. ఆ తర్వాత మరో ప్రాంతానికి షిఫ్ట్ అయిపోవడం, ఈలోపు సిమ్ మార్చేయడం చేస్తున్నాడని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం నిందితుడి ఊహచిత్రం గియించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా, కిడ్నాపర్ బాధితుడి కుటుంబం నుంచి రూ.5కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కుటుంబ సభ్యుల ఆందోళన:
శ్రీకాంత్ కిడ్నాప్ అయింది మొదలు ఇప్పటిదాకా అతని గురించి ఎలాంటి సమాచారం లేదని అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు మాత్రం 'కంగారు పడవద్దు.. శ్రీకాంత్ క్షేమంగా తిరిగొస్తాడు' అని చెబుతున్నట్లు వివరించారు. కేసు కొలిక్కి రావడానికి మరో రెండు రోజులైనా పట్టవచ్చునని తమతో చెప్పినట్లు వెల్లడించారు. మరోవైపు ఓలా ప్రతినిధులు సైతం కేసును ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.